అనకాపల్లి: మహారాష్ట్రలోని జౌరంగబాద్ జిల్లాలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో స్థానిక వేల్పులవీధి ఎస్కెపి పవర్ సిటీజిమ్కు చెందిన మొగ్గా శ్రీనివాస్( అండర్ 59) విభాగంలో ఏపీ నుంచి ప్రాతినిద్యం వహించి, స్క్వాట్లో 155 కిలోల బరువును ఎత్తి జాతీయ స్థాయి రికార్డు నమోదు చేసి బంగారు పతకాన్ని సాధించారు. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో మొగ్గా శ్రీనివాస్ వృత్తి రిత్యా వాహనాలకు టైర్లు, పంచర్లు వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంతో పవర్లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించి, మన రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చినట్లు జిల్లా పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ్రపు నీలా, ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్, కోశాధికారి వి.అజయ్, జిమ్ నిర్వహకులు పూర్ణ అభినందించారు. ఈనెల 23న మహారాష్ట్ర నుంచి శ్రీనివాస్ అనకాపల్లికి రానున్నారని, అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరుగుతుందన్నారు.


