అచ్యుతాపురం రూరల్ : పంచదార్ల ఫణిగిరిపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు వెంటనే పూర్తి స్థాయిలో నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సీపీఎం బృందం పర్యటించి అనంతరం అక్రమ క్వారీ జరిగిన ప్రదేశంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాల వల్ల పంచదార్ల సహజ నీటి వనరులు, పర్యావరణం, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మైనింగ్, సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి అక్రమ తవ్వకాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి దేముడు నాయుడు, రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు, సీఐటీయూ అచ్యుతాపురం మండల కార్యదర్శి కూండ్రపు సోమునాయుడు అధిక సంఖ్యలో సీపీఎం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


