నర్సీపట్నం: పురపాలక సంఘంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధుల కింద మంజూరైన రూ.305 లక్షల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా తడి,పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందించి, పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు. డంపింగ్ యార్డు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సీహెచ్.పద్మావతి, సీహెచ్.రాజేష్, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.


