అధికారులతో సభలు, సమావేశాల నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూ రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను కాలరాస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, అతనికి సహకరిస్తున్న అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ ఎస్.రాయవరం జెడ్పీటీసీ కాకర దేవి, ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి పీజీఆర్ఎస్లో జెడ్పీ సీఈవో నారాయణమూర్తికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడి, గౌరవ పదవుల్లో ఉన్న తమను కాదని, మండల పరిషత్ కార్యాలయంలోనే ప్రభుత్వ పథకాలు, అధికార కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎస్సీ, బీసీ మహిళలుగా ఉన్న తమపై చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. అతని ఆగడాలపై విచారించి తమ నిర్ణయాలు అమలు చేసే విధంగా అధికారులు సహకరించాలని కోరారు.


