అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) పరిరక్షణ కోసం కార్మికులు సాగిస్తున్న పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు కోన లక్ష్మణ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల కుటుంబాలను అదుకోవడం జరిగితే, కూటమి ప్రభుత్వం (ఆర్టీసీ)కార్పొరేట్ వర్గాలకు ధారాదత్తం చేసే విధంగా పావులు కలపడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం ఆర్టీసీ కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయని, అదే సాకుతో ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజా రవాణాశాఖ చైర్మన్ కొనకల సత్యనారాయణ ఈనెల 16న మీడియా సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆగదని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఘనమైన చరిత్ర కలిగిని ఆర్టీసీని తుడిచివేయడం ఎవరితరం కాదన్నారు.


