మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న మిడ్డేమీల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు
నర్సీపట్నం: స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది మహిళలు భోజన పథకంలో పని చేస్తున్నారన్నారు. పారితోషికాలు ఇవ్వకపోయినా పని చేశారన్నారు. ముందస్తు పెట్టుబడి పెట్టి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. డొక్కా సీతమ్మ వంటి వారి పేరు పెట్టి నేడు పథకాన్ని ప్రైవేటుపరం చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. పేద పిల్లలకు పెట్టే ఆహారంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. కార్మికులు అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఐక్యంగా ఎదుర్కొవాలని కోరారు. కార్యక్రమంలో మిడ్డే మీల్ నాయకులు కె.ప్రసన్న, సత్యవతి, చిన్నతల్లి, నూకరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


