నిత్యకల్యాణంలో స్వామికి
యజ్ఞోపవీతధారణ చేస్తున్న అర్చకుడు
సింహాచలం : సింహాచల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి శనివారం ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకే ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపు చేసి, 1001 నామాలతో సహస్రనామార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష హారతులు సమర్పించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం వంటి ఘట్టాల అనంతరం జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను అర్చకులు వేదమంత్రాల సాక్షిగా పూర్తి చేశారు. ఈ పవిత్ర క్రతువులో పాల్గొన్న ఉభయదాతలకు ఆలయ అధికారులు శేషవస్త్రం, కల్యాణ అక్షింతలు ప్రసాదాలను అందజేశారు.


