● పరిరక్షించాలంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ దృష్టికి తెచ్చిన రైతులు
నర్సీపట్నం: కబ్జాకు గురవుతున్న నర్సీపట్నం పెద్ద చెరువును పరిరక్షించాలంటూ ఆయకట్టు రైతులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను కలిసి మొర పెట్టుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని సర్వే నంబరు 271లో వంద ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని ఆయకట్టు రైతులు సబ్బవరపు సూరిబాబు, శెట్టి కన్నయ్యనాయుడు, శెట్టి శ్రీను, తాతాలు, అప్పలనాయుడు, కృష్ణమ్మ మల్లేశ్వరరావు, సుర్ల రమణ, సుర్ల అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం, బలిఘట్టం, జోగునాధునిపాలెం, ధర్మసాగరం, దుగ్గాడ గ్రామాల పరిధిలో 500 ఎకరాలు చెరువు కింద సాగువుతోందన్నారు. సాగు, తాగునీటి జీవనాధారంగా ఉన్న చెరువును కొందరు వ్యక్తులు రాజకీయ నేతల అండతో కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. రాత్రికి రాత్రే లారీలతో మట్టికప్పి చెరువును ఆక్రమించి స్వప్రయోజనాలు కోసం రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా చుక్కనీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారన్నారు. నర్సీపట్నంలో అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు వినడం లేదన్నారు. చెరువును ఆక్రమణదారుల నుంచి కాపాడాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని గణేష్ హామీ ఇచ్చారు.


