చోడవరం: ఎవరూలేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి భారీగా బంగారం, వెండి, నగదును దొంగలు దోచుకుపోయారు. వీటివిలువ రూ.కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా. గోవాడ జంక్షన్ వద్ద బీఎన్రోడ్డుకు ఆనుకుని గల ఆర్ఎంపీ డాక్టర్ అప్పారావు ఇంట్లో ఈ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అప్పారావు గత ఏడాది మరణించగా, ఆయన భార్య ఇటీవల మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. రెండో కుమార్తె సుజాత విశాఖలోని తన అత్తవారింటిలో ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఇటీవల ఆమె గోవాడ వచ్చారు. ప్రస్తుతం అప్పారావు కుమారుడు, రెండో కుమార్తె సుజాత ఈ ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం ఉదయం విశాఖపట్నంలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటి వచ్చి చూడగా తాళాలు పగలుగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించి 40 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.2లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే చోడవరం పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు. సీఐ అప్పలరాజు, తన సిబ్బందితో వచ్చి చోరీకి గురైన ఇంటిని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి క్రైమ్ ఎడిషన్ ఎస్పీ మోహన్రావు, డీఎస్పీ శ్రావణి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
వేలిముద్రలుసేకరిస్తున్న క్లూస్ టీమ్
బీరువాను పరిశీలిస్తున్న సీఐ అప్పలరాజు


