●రైతు సంఘాల నాయకులు వెంకన్న , దొర
సమావేశంలో మాట్లాడుతున్న వెంకన్న, దొర
దేవరాపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దుర్భరంగా మారిందని, వారు పండించిన పంటలకు కనీస మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వ్యవసాయ సంఘం ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమాశంలో వారు మాట్లాడారు. ఈ ఏడాది గిరిజన రైతులు పండించిన జీడి పంటకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. జీడి పంటకు పూత దశలో టీదోమ తెగులు సోకి పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. జీడి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరకు పండించిన రైతులు ఆ భూముల్లో ఇతర పంటలు సాగు చేసేవారని, మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇప్పుడు ఖాళీగా విడిచి పెట్టేస్తున్నారని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు, గిరిజనుల సమస్యలపై ఈ నెల 19న దేవరాపల్లిలో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్టు వెంకన్న, దొర తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా కూలీలు, గిరిజన రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె. ఈశ్వరరావు, సీహెచ్. చినదేముడు, డి. శంకర్, ఎం.ఎర్రునాయుడు, జె.ఈశ్వరరావు, పోతురాజు, దేముడు తదితర్లు పాల్గొన్నారు.


