
మనసు లఘు చిత్రానికి పుదుచ్చేరి సీఎం ప్రశంసలు
సీతంపేట (విశాఖ): నగరానికి చెందిన దర్శకుడు పైడి శంకర్రావు సుదీప్ సాయి హీరోగా రూపొందించిన లఘు చిత్రం ‘మనసు’కు అరుదైన గౌరవం లభించింది. ఈ లఘు చిత్రాన్ని పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. సాహిత్య అకాడమి మాజీ సభ్యుడు డాక్టర్ సుందర్ మురుగన్ ఈ లఘు చిత్రం ఇతివృత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మనసు లఘు చిత్రం భారతీయుల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ, భావితరాలకు మెరుగైన మార్గనిర్దేశం చేసేలా ఉందని సీఎం రంగస్వామి కొనియాడారు. ఈ చిత్రం ప్రపంచ శాంతి అనే మూల సందేశాన్ని, భారతదేశ సంప్రదాయానికి నిలువెత్తు అద్దంగా ఉంటుందని, ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పైడి శంకర్రావు, హీరో సుదీప్ సాయిలను ముఖ్యమంత్రి సత్కరించారు. చిత్ర యూనిట్ తరపున నిర్మాత పైడి సత్యమణి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరో సుదీప్ని సత్కరిస్తున్న పుదుచ్ఛేరి సీఎం