
నిరసన ఫుల్.. రిజిస్ట్రేషన్లు నిల్
ఆదివారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
రిజిస్ట్రార్ ఆఫీసులు.. నిత్యం కిటకిటలాడే కార్యాలయాలు.. కాసుల గలగల వినిపించే ప్రదేశాలు.. రెండు రోజులుగా వెలవెలబోతున్నాయి. అక్కడి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే డాక్యుమెంటు రైటర్లు తమ డిమాండ్ల సాధనకు పెన్ డౌన్ చేయడమే ఇందుకు కారణం. జిల్లాలో రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం తెచ్చే శాఖకు రెండు రోజుల్లో కేవలం రూ.5.75 లక్షలు మాత్రమే వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరాలేమిటి..
సాక్షి, అనకాపల్లి/చోడవరం/అనకాపల్లి టౌన్:
రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంచి రోజని రిజిస్ట్రేషన్ పని పెట్టుకున్నవారు, ఇందుకోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నవారు ఉసూరుమంటున్నారు. కూట మి ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన డాక్యుమెంట్ రైటర్లు అన్ని చోట్లా ఆందోళనకు దిగారు. పెన్ డౌన్ పేరిట పనులు నిలిపివేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం వీరి ఆందోళన ప్రా రంభం కాగా రెండు రోజుల్లోనే కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, సబ్బవరం, కోటవురట్ల, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, కె.కోటపాడు, లంకెలపాలెంలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 5 వేలమంది డాక్యుమెంట్ రైటర్లు, రైటర్ అసిస్టెంట్లు, ఆపరేటర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాలలో జరిగిన రిజిస్ట్రేషన్ల ద్వారా 5 లక్షల 75 వేల ఆదాయం వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో ఉన్న 10 రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో శుక్రవారం 37, శనివారం 61 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. సాధారణంగా రోజుకు సరా సరి 220 నుంచి 240 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కోటి నుంచి కోటీ పది లక్షల రూపాయల వరకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుందన్నారు. రెండు రోజుల్లో రూ.2 కోట్లకు పైకా రావలసిన ఆదాయం రూ.5.75 లక్షలకు పడిపోయిందంటే ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతోంది.
ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా..
దస్తావేజు లేఖర్లు చేస్తున్న సమ్మె వలన ఇబ్బంది లేకుండా ప్రత్యా మ్నాయంగా కార్యాలయ సిబ్బందితో దస్తావేజులు రాయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రజలెవరూ వీరిని ఆశ్రయించలేదు. శుక్ర, శనివారాల్లో అనకాపల్లిలో ఒక్క రిజిస్ట్రేషన్ జరగలేదని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పి.వి.ఎస్.మాధవి కుమారి తెలిపారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనం కావడంతో క్రయవిక్రయాలు క్షీణించాయి. కూటమి ప్రభుత్వ హయాంలో తమ కార్యకలాపాలు కుప్పకూలిపోయాయని రియల్టర్లు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా వడ్డీలు కట్టలేక అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది.
సర్వత్రా నిరసన
జిల్లా కేంద్రం అనకాపల్లిలో దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అయోధ్యశేషు, ఆనంద్ ప్రసాద్ల ఆధ్వర్యంలో జాయింట్ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఆవరణలో రెండవ రోజైన శనివారం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పనిచేస్తున్న దస్తావేజు లేఖర్లు శనివారం ధర్నా చేశారు. ఓటీపీ విధానం అనేక సైబర్ నేరాలకు దారితీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనలో సంఘ గౌరవ అధ్యక్షుడు సీతారామయ్య, ఉపాధ్యక్షుడు బొబ్బిలి చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారిందని డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్కు డాక్యుమెంట్ సిద్ధం చేసే సమయంలో భూమి విక్రయించే వారు మూడుసార్లు ఓటీపీ చెప్పాల్సి వస్తోంది. కొందరు విక్రయదారులు ఓటీపీ చెప్పడానికి సంకోచిస్తున్నారు. మరికొందరు చదువుకోకపోవడంతో తెలియడం లేదు. వృద్ధులు, మొబైల్స్ లేని వారు చెప్పడమే లేదు. దీంతో డాక్యుమెంట్ నిలిచిపోతుంది. ఇదే కాకుండా తీవ్ర సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ ఆధారిత ఓటీపీ సెల్ఫోన్కు వచ్చే లోపు టైమ్ అవుట్ అవుతుండడంతో మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తోంది. ఇలా ఒక డాక్యుమెంట్ కోసం మొత్తం 7 ఓటీపీలు వచ్చేలోపు దాదాపు 30–45 నిమిషాల సమయం పడుతుంది. అలాగే పీడీఈ (పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని కూడా పూర్తిగా రైటర్ చేయాల్సి వస్తోంది. దీనిని సబ్ రిజిస్ట్రార్ తన లాగిన్లో చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదంటూ డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు. దీంతో పీడీఈ నమోదులో తీవ్ర తప్పులు, అలసత్వం నెలకొంటోంది. మరోవైపు మ్యుటేషన్ ప్రక్రియను కూడా రైటర్లే పూర్తి చేయాలని సూచిస్తుండడంతో ఏమైనా తప్పులు దొర్లితే తాము బాధ్యులు కావాల్సి వస్తోందని రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు, వారి సిబ్బంది చేసుకోవాల్సిన పనులను తమతో చేయిస్తుండడంతో తీవ్ర పనిభారం, సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పెన్డౌన్కు సిద్ధమయ్యారు.
డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ ఎఫెక్ట్
వెనుదిరుగుతున్న ప్రజలు
వెలవెలబోతున్న సబ్ రిజిస్ట్రార్
కార్యాలయాలు
రెండు రోజుల్లో భారీగా తగ్గిన
ప్రభుత్వ ఆదాయం
కొత్త విధానాలతో కూటమి ప్రభుత్వం వేధిస్తోందని లేఖర్ల ఆందోళన
ఎడిట్ చేయడానికి వీల్లేకపోవడంతో ఇబ్బందులు..
రిజిస్ట్రేషన్కు ముందు విక్రయదారులు, కొనుగోలుదారుల నుంచి సమాచారం తీసుకుని.. ఆధార్ ఓటీపీ విధానం పూర్తయిన తరువాత డాక్యుమెంట్ తయారుచేస్తున్నాం. అది సబ్ రిజిస్ట్రార్ ముందుకు వెళ్లినప్పుడు ఏదైనా పొరపాటు ఉంటే ఎడిట్ చేసుకునేందుకు వెసులుబాటు లేదు. పొరపాటు జరిగితే ఆరోజు స్లాట్తో పాటు డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ ఆగిపోయినట్లే.
– జి.రాజులునాయుడు,
డాక్యుమెంట్ రైటర్, కోటవురట్ల
నిలిచిన భూమి రిజిస్ట్రేషన్లు, పత్రాల ధ్రువీకరణ
పాతబడిన నియమాలను సవరించాలని, సాఫ్ట్వేర్, ఓటీపీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కక్షిదారులు, లేఖర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నదే మా ఉద్దేశం. మా ఆందోళనతో భూమి రిజిస్ట్రేషన్లు, పత్రాల ధ్రువీకరణ వంటి పనులు నిలిచిపోతాయి. మా డిమాండ్లు, ప్రజల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి.
–సున్నం చిదంబర స్వామి, దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు, నర్సీపట్నం

నిరసన ఫుల్.. రిజిస్ట్రేషన్లు నిల్