
కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టండి
డీఈవో కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదు
యలమంచిలి రూరల్/అనకాపల్లి: జిల్లాలో వివిధ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ డిమాండ్ చేశారు. గురువారం యలమంచిలి కోర్టుపేటలోని కార్పొరేట్ పాఠశాలలో ప్రత్యేక కౌంటర్ ద్వారా చేపడుతున్న పుస్తకాల విక్రయాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు పరిశీలించి, నిర్వాహకులను ప్రశ్నించారు. అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తూ, విద్యా సంస్థ పేరును పుస్తకాలు, క్యారీ బ్యాగులపై ముద్రించారని, అన్ని నిబంధనలు అతిక్రమిస్తున్నా జిల్లా విద్య, వాణిజ్య పన్నుల శాఖాధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అధిక ఫీజులను వసూలు చేయడంతోపాటు, పుస్తకాలు, యూనిఫాం, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మణికంఠ, ఇతర నాయకులు పాల్గొన్నారు.