డాబాగార్డెన్స్(విశాఖ): బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో గురువారం వరుణ జపం నిర్వహించనున్నట్టు ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి బయట పడేందుకు అవసరమయ్యే వర్షాలు కురవాలని, సమృద్ధిగా పంటలు పండాలని, తద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గురు పూజ..
గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం కనకమహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో వ్యాస మహర్షికి గురు పూజ చేశారు. ఉదయం 5 గంటలకు పంచామృతాభిషేకం, 8.30 గంటలకు శ్రీచక్రనవావర్ణార్చన, మహాలక్ష్మీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని ఎయిర్ ప్రఖ్యాత ప్రపంచ నలుమూలలా ప్రకాశింపజేసేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై కురిపించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


