● 90 శాతం సబ్సిడీపై పంపిణీకి ఏర్పాట్లు
● జిల్లా వ్యవసాయాధికారి నందు
సాక్షి,పాడేరు: జిల్లాకు 9,800 క్వింటాళ్ల వరి విత్తనాలను ప్రభుత్వం కేటాయించిందని,ఇప్పటి వరకు 3,352 క్వింటాళ్ల విత్తనాలను తొలి విడతలో అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.‘గిరి రైతుకు విత్తన కష్టం’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు.ఈ ఏడాది కూడా 90శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి మార్చి నెలలోనే జిల్లాకు 13,000 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్కు కలెక్టర్ లేఖ పంపారని ఆయన తెలిపారు.సాధారణ సాగుకు సంబంధించి 48శాతం విస్తీర్ణంలోని వ్యవసాయ భూములకు విత్తనాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.మిగిలిన విస్తీర్ణంలోని భూములకు కొంత వరకు రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2022 నుంచి జిల్లాలో 90శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, ఈఏడాది కూడా సబ్సిడీ విత్తనాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


