దుప్పితూరు ఆలయ భూముల్లో
అచ్యుతాపురం రూరల్: కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఏపీఐఐసీ అధికారులు శుక్రవారం ఆలయ భూమిలో దౌర్జన్యంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఏపీఐఐసీ అభివృద్ధి పేరిట తీసుకున్న భూముల్లో దుప్పితూరులో చేనేతల ఆరాధ్య దైవమైన భద్రావతీ భావనాఋషి ఆలయ భూములు కూడా ఉన్నాయి. 22 ఏళ్లుగా ఆలయ భూమికి అధికారులు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో స్వామివారికి నిత్య ధూప, దీప నైవేద్యాలు, ఏటా కళ్యాణ మహోత్సవాలు కమిటీ సభ్యుల సహకారంతోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఏపీఐఐసీ అధికారులు ఇక్కడ గ్రామం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీలో దేవస్థానం సంబంధించిన సర్వే నంబరు 275/1, 276/3లో ఎ.0.79 సెంట్ల భూమిలో ఇనుప కంచె వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రావతీ దేవస్థానం గ్రామ కమిటీ అధ్యక్షుడు మాడెం సూరిఅప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు నుంచి ఆదేశాలు సంబంధిత శాఖల అధికారులకు వచ్చాయి. వాటిని బేఖాతరు చేస్తూ స్టేటస్ కో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై దేవస్థాన కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం నుంచి వచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా, సంబంధిత ఆలయ భూమిలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా అక్రమ ప్రహరీ నిర్మాణానికి కొమ్ముకాయడం ఏంటని ప్రశ్నించారు. వారిపై ఉన్నత న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న
ఏపీఐఐసీ అధికారులు


