ఉదయం 11.20 గంటలకు ఖాళీగా ఉన్న
మండల సర్వేయర్, ఆర్ఐల కుర్చీలు
ఉదయం 11.15 గంటలకు తాళం వేసి ఉన్న మండల పౌర సరఫరాల శాఖ కార్యాలయం
అనకాపల్లి: మండల స్థాయి అధికారులు వేళాపాళా లేకుండా విధులకు హాజరవుతున్నారు. కార్యాలయాల్లో వీరు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సరైన సమాచారం లేక కొంతమంది తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రధానంగా అనకాపల్లిలో పౌర సరఫరాల శాఖ మండల కార్యాలయం శుక్రవారం ఉదయం 11.15 గంటల వరకు తెరచుకోలేదు. 11.45 గంటలకు సీఎస్డీటీ తాపీగా వచ్చి తాళం తీసి కార్యాలయాన్ని తెరిచారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్, ఆర్ఐ గదులకు తాళాలు తీసి ఉన్నప్పటికీ ఉదయం 11.20 గంటల వరకు ఖాళీగానే కుర్చీలు దర్శనమిచ్చాయి. తహసీల్దార్ ఉదయం 10 గంటలకు వచ్చినప్పటికీ మండల సర్వేయరు, ఆర్ఐ లేకపోవడం గమనార్హం. ఆయా అధికారులు సాయంత్రం సమయంలో రావడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైట్లు వెలుగుతుండగా, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు విద్యుత్ పొదుపు చర్యలు చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వృథా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


