● అల్లాడుతున్న వినియోగదారులు ● పెదలబుడు ఎంపీటీసీ ఆనందకుమార్ ఆవేదన
అరకులోయ టౌన్: మండలంలోని గ్యాస్ వినియోగదారులు తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నారని పెదలబుడు ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో హుకుంపేట భారత్ గ్యాస్ డీలర్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్ అక్కడికి చేరుకొని గ్యాస్ వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.గ్యాస్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకొని నెలలు గడుస్తున్నా.. నేటికీ గ్యాస్ బండలను పంపిణీ చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నట్లు ఎంపీటీసీ తెలిపారు. వడ్డాది మాడుగులకు చెందిన భారత్ గ్యాస్ డీలర్ మృతి చెందడంతో, అక్కడి నుంచి గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. దీంతో స్థానిక గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.


