కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల
కొయ్యూరు: ఈనెల 25 నుంచి జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి కొయ్యూరు మండలానికి రెండు పరీక్ష కేంద్రాలను మంజూరు చేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత, గురుకుల పాఠశాలలో వీటిని ఏర్పాటుచేశారు. ఇదివరకు సప్లిమెంటరీ పరీక్షలు చింతపల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. దీనివల్ల ఇక్కడి నుంచి వెళ్లి రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఈ ఏడాది పది ఫలితాలు ఘోరంగా పడిపోవడంతో దాదాపుగా 370 మందికిపైగా విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరిలో 329 మంది గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు కాగా ప్రభుత్వోన్నత పాఠశాల, బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వారు మిగిలిన వారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉన్నందున ఈ విషయాన్ని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ విద్యాశాఖాధికారులు, పీవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రెండు పరీక్ష కేంద్రాలను ఉన్నతాధికారులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.


