అనకాపల్లి టౌన్: తెలుగు భాషకు వన్నె తెచ్చే విధంగా అనే రచనలు చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం పొందారని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరి వెన్నెల సీతారామశాస్త్రి 71 జయంతి సందర్భంగా అనకాపల్లి పట్టణం గాంధీ నగరంలో ఆయన విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్మించనున్న సిరివెన్నెల స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతారామశాస్త్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అద్భుతంగా పాటలు రాసిన ఆయనకు సినీ పరిశ్రమలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, చిత్ర పరిశ్రమలో అన్నయ్య అని పిలిచిన ఏకై క వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. ఆయన పేరు మీద నిర్మిస్తున్న సిరివెన్నెల స్మృతి వనంకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన జ్ఞాపకాలను మరవకుండా ఈ ప్రాంతం నుంచి మరొక సీతారామశాస్త్రి రావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ ఈ ప్రాంతానికి, తెలుగు భాషకు వన్నె తెచ్చిన రచయిత సీతారామశాస్త్రి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు అందుకున్నారని చెప్పారు. తెలుగు భాష ఉన్నంతవరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అనకాపల్లి వాసిగా ఆయనను గౌరవించడం ఆనందం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు


