● కాఫీ రైతుల ఆవేదన
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని హెక్టాగుడ గ్రామంలోని కాఫీ రైతులతో కాఫీ బోర్డు సభ్యుడు శెట్టి రాజు సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కాఫీ తోటల నిర్వహణ నిధులు మంజూరు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని ఈ సందర్భంగా రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతగిరి మండలంలో వేల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నప్పటికీ, ఇక్కడ కనీసం పూర్తి స్థాయి కార్యాలయం కూడా లేకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శెట్టి రాజు స్పందిస్తూ.. త్వరలోనే కాఫీ రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలతో చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హెక్టాగుడలోని కాఫీ నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో కాఫీ లైజన్ వర్కర్లు అప్పన్న, మొష్యా, సీతారాం, రాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.


