ముంచంగిపుట్టు: శ్రీనృసింహ జయంతి సందర్భంగా గురువారం ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్ గ్రామంలో నృసింహస్వామి ఆలయం వద్ద సింహాచలంలోని సింహాద్రి మఠం ఆధ్వర్యంలో స్వామివారి శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీసింహస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై అధిష్టింపజేసి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణోత్సవం జరిపారు. సింహాచలం దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు పర్యవేక్షణలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో సుమారు 300 మంది గిరిజనులు పాల్గొని తరించారు. థింసా నృత్యాలతో స్వామిని కొలిచారు. గ్రామంలో తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి, గ్రామ సర్పంచ్ బాబూరావు పాల్గొన్నారు.


