సాక్షి, పాడేరు: ఏజెన్సీలో ఏపీ ఎన్సీసీ విభాగం ట్రెకింగ్ శిబిరాలు నిర్వహించనుందని, అధికార యంత్రాంగం సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ టి.నిశాంతి కోరారు. గాలికొండ, బొర్రాగుహలు, పద్మావతి గార్డెన్, అరమకొండ ప్రాంతాలలో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు జరిగే ట్రెకింగ్ శిబిరాలకు సంబంధించి పలు శాఖల అధికారులతో గురువారం ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎన్సీసీ క్యాడెట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసులు, అటవీ శాఖలు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. క్యాంప్ల నిర్వహణకు రెవెన్యూ శాఖ సురక్షిత స్థలాలను పరిశీలించాలని సూచించారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్సీసీ కమాండెంట్ నీరజ్కుమార్, జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.


