కలెక్టర్ దినేష్ కుమార్
పాడేరు రూరల్: మహిళా సాధికారతతోనే నవసమాజ స్థాపన సాధ్యమవుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పాడేరులోని ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎస్పీ అమిత్ బర్దర్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన పలువురు మహిళలను గుర్తించి, వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని కోరారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళలకు అత్యున్నత స్థానం కల్పించే సంప్రదాయం కేవలం భారతదేశంలోనే ఉందని, సమానత్వంతో ముందుకు సాగి మహిళలు అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
మహిళలకే పెద్దపీట : ఎస్పీ అమిత్ బర్దార్
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. పురుషుల కంటే మహిళలకే ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటాయని, ప్రతి ఇంట్లో మహిళా శక్తి ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తేనే ప్రతి ఇంటా వెలుగులు నిండుతాయని, భవిష్యత్తులో మహిళా దినోత్సవ వేడుకలను వాడవాడలా ఒక పండుగలా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్, డీఎస్పీ అభిషేక్, శిశు సంక్షేమ శాఖ పీడీ ఝాన్సీ, గిరిజన సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.


