దేవరాపల్లి: రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో అరకొరగా కేటాయించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోందన్నారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు రూ.62 వేల కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో కేటాయించిన నిధులకు, అధికార గణాంకాలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త పథకాలతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదని చెప్పారు. ఇప్పటికై నా రాజకీయ విమర్శలు పక్కన పెట్టి చిత్తశుద్ధితో నిధులు కేటాయించి, యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం కీలకమని, ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించాలని వెంకన్న కోరారు.


