కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న ప్లాట్లను బాధితులు
తుమ్మపాల: సుప్రజా వెల్ఫేర్ అవెన్యూ సొసైటీ లేఅవుట్లో ప్లాట్లను తప్పుడు రికార్డులతో విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ గేటు వద్ద ప్లాట్ల యాజమానులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరవాడ మండలం పెద్దముషిడివాడలో సర్వే నెం.55, 56, 57లో ‘సుప్రజా లేఅవుట్’ను భూపతిరాజు, సత్యనారాయణ రాజు అభివృద్ధి చేశారన్నారు. అందులో 121 ప్లాట్లను 1997 నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసుకున్నామన్నారు. కోవిడ్ సమయంలో బాలిరెడ్డి అప్పలనాయుడు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి లేఅవుట్ను మ్యూటేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నారని, ‘కేఎంసీ గ్రాండ్’, ‘జగదాంబ వెంచర్స్’ పేర్లతో కొత్త లేఅవుట్లు వేసి అమాయకులకు ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినా నిరోధించడం లేదని వాపోయారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 22 మంది ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంపై ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అక్రమ రికార్డులను వెంటనే రద్దు చేసి, వివాదాస్పద లేఅవుట్లను నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుప్రజా వెల్ఫేర్ అవెన్యూ సొసైటీ అధ్యక్షుడు దొమ్మేటి బుజ్జిబాబు, ఉపాధ్యక్షుడు పిల్లి ప్రభాకర్ రావు, సెక్రటరీ గుడాల దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ జె.శ్రీనివాసరావు, కోశాధికారి చుక్క సత్యనారాయణ పాల్గొన్నారు.


