ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్
● 2.57 ఫార్ములా ప్రకారం చేపట్టాలి
● బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వరరావు
అనకాపల్లి: బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు 2.57 ఫార్ములా ప్రకారం జరగాల్సిందేనని ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా బీఎస్ఎన్ఎల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుప్పిలి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాట్ తీర్పుని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా హైకోర్టులో అపీలు చేసిందన్నారు. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉందని, పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.పట్నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లందరూ సంఘటితంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూల్ 37ఏ ప్రకారం పెన్షన్ చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిదో వేతన సంఘ సిఫార్సుల్లో టేరమ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం బలోపేతంగా ఉందని గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి శ్యామసుందరం మాట్లాడుతూ పెన్షనర్ల నోషనల్ ఇంక్రిమెంట్పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీడీ స్వామి మాట్లాడుతూ పెన్షనర్లకు సీజీహెచ్ఎస్లకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లా కమిటీ అడ్వైజర్ వి.ఆర్.కె.శర్మ మాట్లాడుతూ గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను కలిసి పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పిన్నింటి బాబూరావు, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, సబ్ డివిజన్లలోని పెన్షనర్లు పాల్గొన్నారు.
అనకాపల్లి బ్రాంచి పెన్షనర్ల సంఘం ఎన్నిక
ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి గౌరవాధ్యక్షునిగా ఎడ్ల త్రినాథరావు, అధ్యక్షునిగా కోన సత్యనారాయణ, కార్యదర్శిగా పక్కి రమేష్, కోశాధికారిగా వై.కోటిలింగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్


