అల్లూరి జిల్లా గజగజ
పలు గ్రామాల్లో మంచువర్షం
డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టులో తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
సాక్షి, పాడేరు/చింతపల్లి/జి.మాడుగుల: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలితీవ్రత పెరుగుతోంది. బుధవారం రాత్రి జి.మాడుగులలో 3.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి.
డుంబ్రిగుడలో 3.6, అరకువ్యాలీలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, వై.రామవరంలో 8.7, మారేడుమిల్లిలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి గురువారం తెలిపారు.
జి.మాడుగుల, డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడంతోపాటు భారీగా పొగమంచు కురుస్తోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలితీవ్రతకు స్థానికులు గజగజ వణికిపోతున్నారు.


