
భగ్గుమన్న పాత్రికేయులు
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసన ● లోపాలు ఎత్తి చూపితే అంత కక్ష ఎందుకు?
పాడేరు: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ కూటమి ప్రభుత్వ అక్రమాలపై సాక్షిలో వార్తలు రాస్తే యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్తో పాటు వార్తలు రాస్తున్న విలేకరులపై పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేయడం సరియైన పద్ధతి కాదంటూ నినాదాలు చేశారు. సాక్షి పత్రిక కార్యాలయాలతో పాటు విలేకరుల ఇళ్లలో అకారణంగా సోదాలు నిర్వహించడం విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. అక్కడనుంచి పాడేరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. డీఎస్పీ షహబాజ్ అహ్మద్కు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పీడీ చక్రవర్తి, తాంగుల మహేష్, టమికే సునీల్, భాస్కర్, ప్రేమ్కుమార్, జవ్వాది శ్రీను, కంభం మహేష్, పారిజాతం, భీమ్రాజు, రాంబాబు, శోభన్రాజు, శ్రీను, బేరా నానీ, విలేకరులు ఎన్ఎం కొండబాబు, కొంటా దుర్గారావు, శెట్టి కోటేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో..
డాబాగార్డెన్స్ (విశాఖ): ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్టులు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్కి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఎంఆర్ఎన్ వర్మ, ఏపీడబ్ల్యూజే నాయకుడు, పి.నారాయణ్, జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

భగ్గుమన్న పాత్రికేయులు