నిర్వాసితులకు అండగా ప్రభుత్వం

చింతూరు: పోలవరం ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చింతూరు ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్ అన్నారు. సర్పంచ్ కారం కన్నారావు అధ్యక్షతన పోలవరం పరిహారం, పునరావాసం(ఆర్అండ్ఆర్)గ్రామసభ మంగళవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తరచూ వరద ముంపునకు గురవుతున్న దృష్ట్యా రెండోదశ పరిహారంలో ఉన్న చింతూరును ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి తొలిదశలో చేర్చడం జరిగిందన్నారు. అధికారులు ప్రకటించిన ముంపు జాబితాలో ఎవరి వివరాలైనా నమోదు కాకుంటే దరఖాస్తు రూపంలో అధికారులకు వివరాలు అందచేయాలని సూచించారు. పార్టీలకతీతంగా ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలని, గ్రామసభల్లో ఆందోళనలు చేయడం ద్వారా అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. మంగళవారం నిర్వహించిన గ్రామసభలో 7, 8, 9, 10, 11, 13 క్లస్టర్ల పరిధిలోని కుటుంబాల సమాచారాన్ని అధికారులు వెల్లడించారు. చింతూరు యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విక్టర్బాబు, తహసీల్దార్ సాయికృష్ణ, ఎంపీడీవో రవిబాబు, ఎస్ఐ శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రసాదరావు పాల్గొన్నారు.