ఇచ్చోడ: రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనే ప్రభుత్వ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. లక్ష్యం సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను మూసి వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. జిల్లాలో ఇప్పటికీ ఇంకా సగం మంది వద్ద పంట దిగుబడి నిల్వలు ఉండడం గమనార్హం. మరోవైపు ఆయా యార్డులకు తీసుకువచ్చి నెలరోజులవుతున్నా కోనుగోలు చేయకపోవడంతో వారి ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. గత్యంతరం లేక కొందరు ప్రైవేట్లో విక్రయించి నష్టపోతుండగా.. చాలా మంది ప్రభుత్వ ప్రకటన కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు లక్ష 16 వేల క్వింటాళ్లే
జిల్లా వ్యాప్తంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 18 కేంద్రాల ద్వారా మార్చి 26 నుంచి ఏప్రిల్ 24 వరకు కేవలం లక్ష 16వేల 885 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. కొంత మంది రైతులు పత్తి, సోయా సాగు చేసిన భూములను చదును చేసి రబీలో శనగ సాగు చేయడం ద్వారా పంట చేతికి రావడం కొంత ఆలస్యమైంది. ప్రభుత్వం విధించిన గడువులోపు వారి పంటలు చేతికి రాక పోవడంతో మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. మద్దతు ధర రూ.5,875 ఉండగా..ప్రైవేట్లో రూ.5వేలకు మించి పలకకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో శనగసాగు వివరాలు
సాగు విస్తీర్ణం : 42,277ఎకరాలు
దిగుబడి అంచనా : 3,34,700 క్వింటాళ్లు
మద్దతు ధర : రూ.5,875
కొనుగోలు చేసింది : 1,16,885 క్వింటాళ్లు


