
ఆమె భద్రతకు భరోసా
● పోకిరీల చేష్టలకు ‘షీటీం’తో చెక్ ● పలువురిపై పోక్సో కేసులు ● విద్యాసంస్థల్లో అవగాహన ● వేధింపులా.. డయల్ 8712659953
ఆదిలాబాద్టౌన్: షీటీమ్.. మహిళలపై దాడులు, వేధింపులు, ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది జిల్లాలో పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసుశాఖ వారి రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసింది. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నా రు. మైనర్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న వారిపై పోక్సో కేసులు పెట్టి కటకటాల పాలు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందు కు వెనుకంజ వేస్తున్న వారికి సైతం అండగా నిలు స్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తూ వారి వివరాలు గోప్యంగా ఉంటున్నారు.
జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు..
● ఆదిలాబాద్లోని ఓ పాఠశాలలో షీటీమ్ సభ్యులు గుడ్టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా, తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని బృంద సభ్యులకు సదరు విద్యార్థిని తెలిపింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వన్టౌన్లో పోక్సో కేసు నమోదు చేశారు.
● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్ను ఆశ్రయించారు. దీంతో సదరు టీచర్పై పోక్సో కేసు నమోదు చేశారు.
● ఓ గ్రామం నుంచి యువతి టైలరింగ్ కోసం జిల్లా కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెను వేధిస్తున్న యువకుడిని షీటీమ్ మారువేషంలో వెళ్లి పట్టుకుని అరెస్టు చేశారు.
● ఓ బస్టాండ్లోని వాష్రూమ్లో ఓ మహిళకు సంబంధించిన ఫోన్ నంబర్ను ఓ వ్యక్తి రాశాడు. దీంతో ముగ్గురు ఆ మహిళకు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ షీటీంను ఆశ్రయించింది. ముగ్గురిని అరెస్టు చేయడంతో పా టు అక్కడి నుంచి ఫోన్ నంబర్ తొలగించారు.
● గుడిహత్నూర్లో ఓ బాలిక ఫొటోలు తీసి నిందితుడు వేధింపుకు పాల్పడ్డాడు. స్నేహితులకు వాటిని షేర్ చేశాడు. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
● ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వివాహితను ఏడేళ్లుగా ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నా డు. దీంతో బాధితురాలు షీటీంను సంప్రదించగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
విస్తృత స్థాయిలో అవగాహన..
మహిళలు, యువతులు, విద్యార్థినులపై జరుగుతు న్న అఘాయిత్యాలు, వేధింపులు, గుడ్టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా తదితర విషయాలపై షీటీ మ్ సభ్యులు విస్తృతంగా అవగాహన సదస్సులు ని ర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, గ్రామాలకు వెళ్లి కూలీల కు సైతం అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తు తం ఒక షీటీమ్ పనిచేస్తుంది. ఇందులో ఏఎస్సై బి.సుశీల,హెడ్కానిస్టేబుల్ వాణిశ్రీతో పాటు ఇద్దరు ఏఆర్ మహిళా పోలీసులున్నారు. వీరికోసం ప్రత్యేక వాహనం కేటాయించారు. వీరు జిల్లాలో ఎక్కడ సంఘటన జరిగినాచేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.
జిల్లాలో కేసుల వివరాలు..
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 18 కౌన్సెలింగ్లు, 51 పెట్టి కేసులు, 16 ఎఫ్ఐఆర్, 84 అవగాహ న సదస్సులు నిర్వహించారు. 254 గ్రామాల్లో షీటీ మ్ సభ్యులు పర్యటించారు. నాలుగు బాల్య వివా హాలను అడ్డుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు పోక్సో కేసులు నమోదు చేశారు.
వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు..
మహిళలు, యువతులు, విద్యార్థినులను పోకిరీలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు షీటీమ్ సెల్:8712659953 నంబర్పై సంప్రదించాలి. స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. షీటీమ్ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ