
శిక్షణ నిధులు హాంఫట్!
● హెచ్సీఏ సమ్మర్ క్యాంపులో గోల్మాల్? ● శిబిరం పేరిట ప్రైవేట్ కోచింగ్ ● జిల్లా స్థాయిలో అక్రమాలపై ఫిర్యాదులు
ఆదిలాబాద్: క్రికెట్.. ఈ క్రీడంటే ఇష్టపడని వారు ఉండరు. సెలవులొస్తే చాలు చిన్నారులు బ్యాట్, బాల్ పట్టుకొని మైదానాల్లో వాలిపోతుంటారు. ఇక పెద్దవారు టీవీలు, స్టెడియాల్లో మ్యాచ్లను వీక్షిస్తూ క్రీడాసక్తి చూపుతున్నారు. క్రికెటర్లకు ఉన్న క్రేజీతో ఆ ప్రభావం చిన్నారులపై పడుతోంది. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తుండడంతో మంచి క్రికెటర్లుగా ఎదగాలని వారు ఆశిస్తున్నారు. అయితే దీనిని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. శిక్షణ పేరిట అర్హతలు లేని వారికి కోచ్ బాధ్యతలు అప్పగిస్తూ వేలాదిగా డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని సీఐ డీ అరెస్టు చేయడంతో జిల్లా స్థాయిలో సైతం అవి నీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ మైదానం.. ప్రైవేట్ శిక్షణ
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా పిల్లల నుంచి రూ.వేలల్లో ఫీజు వసూలు చేయడం గమనార్హం. అంతేకాకుండా అర్హత లేని ఓ జూనియర్కు కోచింగ్ బాధ్యతలు అప్పగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా అధికారులు మామూలుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
మరుగునపడుతున్న ప్రతిభావంతులు..
జిల్లావ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభగల క్రికెటర్లు ఉన్నారు. అయితే సరైన ప్రోత్సాహం లేక, శిక్షణ సౌ కర్యాలు కరువై వారంతా రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించలేని దుస్థితి. రూ.వేలల్లో ఫీజు లు చెల్లిస్తేనే అకాడమీలలో శిక్షణ పొందే వీలు ఉంటుంది. అయితే ఆసక్తి, అభిరుచి, నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేక పలువురు ఈ క్రీడ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రస్థాయిలోనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగే అవకా శాలు లేకపోలేదు. హెచ్సీఏ నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది జిల్లాకు చెందిన క్రీడాకారులు హైదరాబాద్ వరకు సైతం వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని సీనియర్ క్రికెట్ శిక్షకులు చెబుతున్నారు. రాజఽ దాని కేంద్రంగా అకాడమీల్లో శిక్షణ పొందుతున్న వారికే అవకాశాలు ఇస్తున్నారనే ఆరోపణలున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల్లో అర్హులైన శిక్షకులు లేకపోవడం, ఫీజులు చెల్లించిన వారికి, అస్మదీయులకు ఎంపికలో పెద్దపీట వేయడంతో ఈ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యం జిల్లాకే పరిమితమవుతుందనే విమర్శలున్నాయి.
అధ్యక్షుడి అరెస్టుతో కదులుతున్న డొంక..
హెచ్సీఏ హైదరాబాద్ కేంద్రంగా ఉండే క్రీడాకారులను మాత్రమే దేశవాళి టోర్నీలకు ఎంపిక చేస్తూ జిల్లాల్లోని వారిని నిర్లక్ష్యం చేస్తుందనే అపవాదు మూటగట్టుకుంది. గతేడాది ఏప్రిల్లో రాష్ట్రంలోని ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలో మూడు శిక్షణ కేంద్రాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్, మంచిర్యాల, సిర్పూర్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే క్రీడాకారులకు సరైన శిక్షణ ఇవ్వకుండా, సదుపాయాలు సైతం కల్పించకుండా హెచ్సీఏ నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాకుండా శిక్షణకు వచ్చిన క్రీడాకారుల నుంచి సైతం ఫీజులు వసూలు చేయడం గమనా ర్హం. రాష్ట్రస్థాయిలో అక్రమాలు బయటపడడంతో జిల్లా స్థాయిలోనూ స్థానిక హెచ్సీఏ ప్రతినిధులు నిధులను పక్కదారి పట్టించారనే వాదనలకు బలం చేకూరుస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు తాజాగా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని విచారణ జరిపితే అక్రమాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంది.
హెచ్సీఏ నిధులు దుర్వినియోగం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న నిధులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దుర్వినియోగం అవుతున్నాయి. ఏటా క్రికెట్ క్రీడాభివృద్ధికి రూ.20లక్షలు విడుదలవుతున్నాయి. అలాగే వేసవి శిక్షణ శిబిరం కోసం రూ.15లక్షలు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కానరావడం లేదు. ప్రతిభ ఉన్నప్పటికీ ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు వెళ్లలేకపోతున్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయి.
– నరోత్తం రెడ్డి, టీసీఏ ఆదిలాబాద్ ఇన్చార్జి
వివరాలు సేకరిస్తున్నాం..
స్టేడియంలో హెచ్సీఏ క్రికెట్ శిక్షణ శిబిరానికి సంబంధించి అనుమతుల విషయంలో వివరాలు సేకరిస్తున్నాం. స్టేడియంలో ప్రైవేట్ శిక్షణ అందిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో సదరు శిక్షకులు, నిర్వాహకులను విచారించి, నివేదికను కలెక్టర్కు అందిస్తాం. వారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం.
– జక్కుల శ్రీనివాస్,
డీవైఎస్వో ఆదిలాబాద్

శిక్షణ నిధులు హాంఫట్!

శిక్షణ నిధులు హాంఫట్!