
అస్మదీయులకే అందలం!
● క్రీడాశిక్షకుల ఎంపికలో ఇష్టారాజ్యం ● నచ్చినవారికి ‘వేసవి’ కేంద్రాల కేటాయింపు ● శిబిరాల్లో పారదర్శక శిక్షణపై నీలినీడలు
ఆదిలాబాద్: చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏటా వేసవి సెలవుల్లో నెల పాటు ఉచిత శిక్షణ శిబి రాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి సైతం వాటి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 శిబిరాలకు అనుమతి ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో క్రీడా శిక్షకుల ఎంపికలో సంబంధిత అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరించారనే చర్చ సాగుతోంది. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి నచ్చిన వారికి కేటా యించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మౌఖికంగానే శిక్షకుల ఎంపిక..
నిబంధనల ప్రకారం ఈ శిబిరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రకటనలు జారీ చేయాలి. అయితే ఇవేమీ లేకుండానే తమకు నచ్చిన వారికి కేంద్రాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో అర్హులైన తాము నష్టపోయామని పలువురు శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది శిబిరాలకు మాత్రమే అనుమతి రాగా, ఇష్టారీతిన ఎంపిక చేయడంతో శిక్షణ కేంద్రాల సంఖ్య ఏకంగా 34 దాటింది. జిల్లాలోని ప్రతీ మండలానికి ఓ కేంద్రం ఏర్పాటు చేసినా 21 మండలాలకు ఒక్కో శిక్షణ కేంద్రం ఏర్పాటు అవ్వాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఒకే ఆటకు పలు ప్రాంతాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. ఒక్క ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే ఏడు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు సిరికొండ, తాంసి, గాదిగూడ, భోరజ్, భీంపూర్, సాత్నాల మండలాలకు కేంద్రాలు లేవు. అన్ని ఆటలకు, మండలాలకు ప్రాధాన్యమిస్తే వివిధ క్రీడాంశాల్లో చిన్నారులకు మెరుగైన శిక్షణ అందేది. శిక్షకుల ఎంపిక కోసం స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఉంటే ఉత్సాహవంతులైన శిక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు.
నిర్వహణపై ఆందోళన..
శిక్షకుల ఎంపికలో తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించడం విషయంలో శ్రద్ధ చూపిన అధికారులు శిక్షణ సమయంలో ఏ మేరకు పర్యవేక్షిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో శిక్షణ కేంద్రాలు హడావుడిగా జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించి తర్వాతి రోజుల్లో వాటిని నడపకుండా పలువురు శిక్షకులు నిర్లక్ష్యం వహించడంపై ‘సాక్షి’లో సైతం కథనాలు ప్రచురితమయ్యాయి. ఫలితంగా ఎంతో మంది చిన్నారులు వేసవి శిక్షణకు దూరమయ్యారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, క్రీడా సంఘాల బాధ్యులు, శిక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ముందుకు వస్తే ఎంపిక చేస్తాం..
శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యే ముందు ఎవరైనా శిక్షణ ఇవ్వడానికి ముందుకు వస్తే నిబంధనలకు అనుగుణంగా పరిగణలోనికి తీసుకుంటాం. ఈనెల 31వరకు దరఖాస్తులు అందించవచ్చు. శిక్షకుల ఎంపిక విషయంలో వ్యాయా మ ఉపాధ్యాయుల సంఘం, క్రీడా శిక్షకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.
– వెంకటేశ్వర్లు, డీవైఎస్వో
ఒకే కోచ్కు రెండు కేంద్రాలు..
జిల్లా కేంద్రంలో ఓకే క్రీడకు సంబంధించి, రెండు వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలను ఒకే శిక్షకుని కి కేటాయించడం ఎంపికలో అధికారుల పక్షపా త ధోరణిని స్పష్టం చేస్తుంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో శిక్షకుడు ఏ విధంగా శిక్షణ ఇ వ్వడం సాధ్యమవుతుందో అధికారులకే తెలియా లి. శిక్షకునికి రూ.4వేల గౌరవ వేతనం అందజేస్తారు. అయితే ఎంపికలో పారదర్శకతకు పాతరేయడం అనుమానాలకు తావిస్తోంది.

అస్మదీయులకే అందలం!