breaking news
Wonder Book of World
-
అచీవర్స్ విద్యార్థుల ప్రపంచ రికార్డ్
సప్తగిరికాలనీ (కరీంనగర్): కరీంనగర్లోని అచీవర్స్ స్కూల్ విద్యార్థులు పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్లో రికార్డు సాధించారు. తొలిసారిగా పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్ విభాగంలో పాఠశాలకు చెందిన 111 మంది విద్యార్థులు ఒకేసారి కేవలం 38 సెకన్లలో పరిష్కరించి ప్రపంచ రికార్డ్ను సృష్టించారు. వండర్ బుక్ రికార్డ్స్ ఇండియా సమన్వయకర్త బింగి నరేందర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమన్వయకర్త స్వర్ణశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ హోల్డర్ విజయ భాస్కర్ల సమక్షంలో పిరామింక్స్ ర్యూబిక్ క్యూబ్ను 111 మంది విద్యార్థులు కేవలం 38 సెకన్లలో పూర్తి చేశారు. దీంతో వారు వండర్ బుక్ రికార్డ్లో పాఠశాల పేరు, పాఠశాల విద్యార్థులు చోటు సంపాదించారని ప్రకటించారు. అనంతరం వండర్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ను పాఠశాల డైరెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ సీహెచ్ పల్లవిలకు ప్రదానం చేశారు. -
భళా.. సాయి మేఘన మేధస్సు..
♦ క్రీ.శ. 1 నుంచి 9999 వరకు కేలండర్ జ్ఞాపకం ♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కరీంనగర్ కల్చరల్: అద్భుత మేధస్సుతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది కరీంనగర్కు చెందిన ఎలగందుల సాయిమేఘన. జిల్లాకేంద్రానికి చెందిన డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్-సౌమ్య కుమార్తె సాయిమేఘన(14) కరీంనగర్లో అల్ఫోర్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. చేంజ్ లర్నింగ్ అకాడమీలో సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ పొందుతోంది. క్రీస్తుశకం 1వ సంవత్సరం నుంచి క్రీస్తుశకం 9999 వరకు సంవత్సరాల కేలండర్లను జ్ఞాపకం పెట్టుకుంది. సంవత్సరం, నెల తేదీ చెబితే వెంటనే అది ఏ రోజో చెబుతోంది. వివిధ దేశాల్లో అనుసరించే అన్ని నెలలు, తెలుగు సంవత్సరాల పేర్లు చెబుతూ అబ్బుర పరుస్తోంది. శుక్రవారం కరీంనగర్లోని శ్వేత హోటల్ హాల్లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు బింగి నరేందర్, స్వర్ణశ్రీ సమక్షంలో సాయిమేఘన తన మేధస్సు ప్రదర్శించింది. ఆమె అద్భుత మేధాశక్తిని గుర్తించిన వారు రికార్డును నమోదు చేసుకుని జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సాయి మేఘన తల్లిదండ్రులతో పాటు మెమరీ శిక్షకుడు హరీశ్కుమార్, చేంజ్ లర్నింగ్ అకాడమీ ప్రధాన శిక్షకుడు వేణుకుమార్, ఎస్సారార్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.