breaking news
vro suspend
-
ఎందుకు చేశావ్ ఈ పని?
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : ‘పిత్రార్జితం ద్వారా సంక్రమించిన ఎకరంన్నర పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చేందుకు వీఆర్వో పుల్లయ్య రూ.50 వేలు లంచం అడిగాడు. గత్యంతరం లేని స్థితిలో రూ.50 వేలు ఇచ్చి వెంటనే పనిచేసి పెట్టమన్నాను. ఏడాదిన్నరగా తిప్పుకుంటూ భూమిని ఆన్లైన్ చేయించకపోగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఇవ్వలేదు’ అంటూ అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మొరపెట్టుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరరావు పాల్గొన్నారు. పెదపాలెంకు చెందిన తురకా రామకోటమ్మ అనే మహిళా రైతు చాలా ఆవేదనతో ఎమ్మెల్యే వద్దకు వచ్చి తన గోడు వినిపించింది. అప్పు చేసి మరీ వీఆర్వో పుల్లయ్యకు రూ.50 వేలు ఇచ్చానని తెలిపింది. చలించిన ఎమ్మెల్యే శంకరరావు వెంటనే వీఆర్వో పుల్లయ్యను పిలిపించారు. ‘ఎందుకు చేశావ్ ఈ పని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సార్.. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆన్లైన్ చేయలేకపోయా. పాస్ పుస్తకం ఇవ్వలేకపోయా’నని వీఆర్వో సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. ‘లంచం తీసుకున్నావా. లేదా’ అని ఎమ్మెల్యే నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకొన్నాడు. రెండు రోజుల్లో ఆమె భూమిని ఆన్లైన్ చేయించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రూ.50 వేలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మరికొందరు వీఆర్వోల అవినీతి, అక్రమాలనూ పలువురు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీఆర్వో పుల్లయ్య సస్పెండ్ పట్టాదారు పాసుపుస్తకాల కోసం వచ్చిన ఒక మహిళ వద్ద రూ.50 వేల లంచం తీసుకుని యేడాదిన్నర కాలంగా తిప్పుకున్న వీఆర్వో పుల్లయ్యను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అచ్చంపేట తహసీల్దార్ రాంభూపాల్రెడ్డి సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. -
వేటు పడింది
తూర్పుగోదావరి, తుని రూరల్ (తుని): పోలవరం ప్రధాన ఎడమ కాలువ నిర్వాసితులు కుమ్మరిలోవ కాలనీవాసుల ఆర్ఆర్ ప్యాకేజీలో అక్రమాలకు బాధ్యులైన ఆర్ఐ, వీఆర్వోలపై వేటు పడింది. సెప్టెంబరు పదిన ‘సాక్షి’లో ‘‘బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం!’’ శీర్షికన ప్రచురితమైన కథనం అప్పుడే తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు వీఆర్వో, ఆర్ఐలపై వేటు వేసి, బినామీ తమ్ముళ్ల స్వాహా పర్వానికి అడ్డుకట్టు వేశారు. మంగళవారం తుని మండలం కుమ్మరిలోవ వచ్చిన జాయింట్ కలెక్టర్ మల్లికార్జున బాధిత నిర్వాసితుల వాదనలు, అందించిన ఆధారాలను పరిశీలించారు. ప్రాథమికంగా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి వీఆర్వో సాయిబాబా, ఆర్ఐ కార్తీక్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మల్లికార్జున విలేకర్లతో మాట్లాడారు. ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరైన జాబితాలో మొదట, చివరి పేజీలను ఉంచి, మధ్య పేజీల్లో పేర్లు మార్పు చేసి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఉన్నత అధికారులను సైతం తప్పుదారి పట్టించినట్టు పేర్కొన్నారు. నిర్వాసితులు డిమాండ్ మేరకు అనర్హులుగా భావిస్తున్న 29 మంది పేర్లను తొలగించడంతో పాటు అర్హులైన మరో 65 మందికి న్యాయం చేసేందుకు సమగ్ర విచారణ చేస్తామన్నారు. ఇందుకుగాను వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు చొప్పున తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలతో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తామన్నారు. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు. డిసెంబరు నెలాఖరుకి పునరావాసం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు అప్పగిస్తామన్నారు. సొంతంగా నిర్మించునే లబ్ధిదారుల ఇళ్లను పర్యవేక్షిస్తామన్నారు. పోలవరం కాలువ నిర్మాణం సకాలంలో పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో నిర్వాసితులపై దాడికి యత్నం, తోపులాట జాయింట్ కలెక్టరు వస్తుండడంతో కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాస కల్పన ప్రాంతానికి పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న నిర్వాసితులను నష్టం ఎలా జరిగింది? ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు? అంటూ ప్రశ్నించిన ఆర్డీఓ ఇరువర్గాలు అవగాహనకు వచ్చి రాజీపడండి, లేదంటే విచారణ చేస్తే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. అప్పటికే చుట్టముట్టి ఉన్న బినామీ తమ్ముళ్ల ఒక్కసారిగా రెచ్చిపోయి బాధిత నిర్వాసితులపై దాడికి యత్నించారు. బాధితులుసైతం తిరగబడడంతో తోపులాట జరిగింది. దీంతో ఆర్డీఓ అక్కడి నుంచి దూరంగా వెళ్లి నిర్మాణంలో ఉన్న కట్టడాలను పరిశీలించారు. కొంతసేపటికి తోపులాట సద్దుమణగడం, అదే సమయానికి సంఘటన స్థలానికి జాయింట్ కలెక్టర్ మల్లికార్జున, బందోబస్తుకు రూరల్ పోలీసులు చేరుకున్నారు. బాధిత నిర్వాసితుల డిమాండ్లను, ఆరోపణలు విన్న జేసీ అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని, అర్హులకు విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరీకి నష్టపరిహారంతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీ అందిస్తామన్నారు. వీఆర్వో, ఆర్ఐలను సస్పెండ్ చేసినట్టు ప్రకటించడంతో బాధిత నిర్వాసితులు శాంతించారు. త్రుటిలో తప్పిన సస్పెన్షన్ ఇళ్ల నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీ నివేదిక తయారీలో మొదట సంతకం చేసిన పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీఆర్వో, ఆర్ఐతో పాటు కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్టు జేసీ మల్లికార్జున ప్రకటించారు. అక్కడే ఉన్న కార్యదర్శి సత్యనారాయణను వివరణ కోరారు. కార్యదర్శిగా చేరిన కొత్తలో ఈ వ్యహరం జరిగిందని, గ్రామ కమిటీ నివేదిక పేరుతో నా వద్ద సంతకాలు తీసుకున్నట్టు కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. అలా చేసిన సంతకాల నివేదికనే ఆర్ఆర్ ప్యాకేజీకి పంపించడంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని, తన వాదనను కార్యదర్శి వినిపించాడు. దీనిని గమనించిన జేసీ తొలి తప్పిదంగా హెచ్చరించడంతో సస్పెన్షన్ వేటునుంచి కార్యదర్శి సత్యనారాయణ బయటపడ్డాడు. జరిగింది ఇదీ... పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం మండలంలో 18 కిలో మీటర్ల పొడవునా జరుగుతోంది. ప్రధానంగా కుమ్మరిలోవ కొండపై నుంచి తాండవ చక్కెర కర్మాగారం వెనుక కొండకు తాండవ నది అక్విడెక్టు నిర్మించాల్సి ఉంది. ఇందుకు కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై భారీ తవ్వకాలు చేయాల్సి ఉంది. భారీ తవ్వకాల్లో బండరాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉంది. అలా ఎగిరిపడే వచ్చే బండరాళ్లు కాలనీ ఇళ్లపై, ప్రజలపై పడితే ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో కుమ్మరిలోవకాలనీని తొలగించేందుకు ప్రతిపాదనలు చేశారు. కాలనీని తరలించేందుకు, నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ప్రతిపాదించారు. కాలనీలోఉన్న 315 ఇళ్లను తొలగించి, ప్రత్యామ్నాయంగా దుద్దికలోవలో పునరావాస కాలనీ నిర్మించనున్నారు. ఈ క్రమంలో 315 మంది బాధితుల పేర్లలో కొంతమంది పేర్లను తొలగించి, స్థానే బినామీ పేర్లను నమోదు చేశారు. నమోదు చేసిన పేర్లకు వచ్చే ఆర్ఆర్ ప్యాకేజీ రూ.మూడు కోట్లకుపైగా మొత్తాలను పంచుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. ఈ అక్రమాన్ని వెలుగులోకి తెస్తూ సెప్టెంబర్ పదిన ‘సాక్షి’లో ‘పచ్చ రాబందులు, బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం! శీర్షిక న కథనాన్ని ప్రచురించింది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. తమకు న్యాయంగా దక్కాల్సిన పరిహారాన్ని నాయకులు దోచుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతమంది తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధిత నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు. -
సస్పెండైనా... రెండేళ్లపాటు జీతం
లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో కదిలిన డొంక బాధ్యులెవరన్నదానిపై తీస్తున్న ఆరా నాడు పనిచేసిన అధికారుల్లో గుబులు సెలవుపై వెళ్లేందుకు యత్నాలు విజయనగరం : ఏసీబీ వలలో చిక్కుకుని విచారణ తరువాత కేసు రుజువై ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి రెండేళ్లపాటు జీతం అందించిన వైనమిది. ఒకరు లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుతో ఆ రహస్యం కాస్తా బట్టబయలైంది. దీనికి బాధ్యులైనవారందరి మెడకూ ఈ ఉచ్చు బిగుసుకుంటుండటంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మెరకముడిదాం మండలంలో వీఆర్వోగా పనిచేసిన ఆర్.చలపతిరావు 2010లో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తిరిగి తాత్కాలికంగా భోగాపురంలో ఉద్యోగమిచ్చారు. ఆయన భోగాపురం మండలంలో పనిచేస్తుండగానే ఏసీబీ కేసు రుజువయింది. ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ ఉత్తర్వులను గతంలో ఆయన పనిచేసిన మెరకముడిదాం మండల తహశీల్దార్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపించారు. ఆ ఉత్తర్వులను సంబంధిత అధికారులు చలపతిరావు ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకోకుండా, ఎటువంటి రికార్డులూ నమోదు చేయకుండా వీఆర్వోకు వేరే వ్యక్తి ద్వారా సాధారణంగా భావించి పంపించేశారు. భోగాపురం మండలంలో పనిచేస్తున్న ఆయన ఆ ఉత్తర్వులను దాచేసి అక్కడే ఎంచక్కా రెండేళ్ల పాటు పని చేశారు. ఇదీ జరిగిన కథ! అప్పట్లో కొంత మందికి ఛార్జి మెమోలను కలెక్టర్ ద్వారా చేరాయి. విషయం తెలుసుకున్న కనిమెరకకు చెందిన బగ్గాం ఎర్రయ్య అనే వ్యక్తి తొలగించిన తరువాత రెండేళ్ల పాటు వేతనాలెలా ఇచ్చారంటూ లోకాయుక్తను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం పోలీసులకు కూడా పాకింది. వెంటనే దర్యాప్తు మొదలైంది. బాధ్యులందరి మెడకూ ఉచ్చు ! కలెక్టరేట్లోని ఏఓ, ఏ-2 లతో పాటు డీఆర్వో, ఉత్తర్వులను తిప్పి పంపకుండా వ్యక్తుల ద్వారా చేరవేసిన తహశీల్దార్, వేతనాలు ఇచ్చిన ట్రెజరీ సిబ్బంది ఇలా చాలా మంది మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కలెక్టరేట్లోని కొన్ని సెక్షన్లకు పోలీసులు వచ్చి అప్పటి కేసుపై ఎవరెవరు బాధ్యులన్న సమాచారాన్ని సేకరించారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్లు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పోలీసులనుంచి ఏ క్షణాన్నైనా పిలుపు వస్తుందేమోనన్న భయంతో అప్పటి ఉద్యోగులు సెలవు పెట్టి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.