breaking news
Vote quotes the case
-
సమస్యలు పరిష్కరించేది జనార్దనే
జనార్దన్ టీడీపీ కార్యాలయ ఇన్చార్జి: సెబాస్టియన్ మా సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించేది అతనే హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్ ఎవరనే విషయాన్ని ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న బిషప్ సెబాస్టియన్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యతలు నిర్వహించే టీడీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లే అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్తాయన్నారు. షరతులతో కూడిన బెయిల్పై బయటకొచ్చిన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి సంతకం చేయడానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీడీపీ కార్యాలయ ఇన్చార్జి టీడీ జనార్దన్తోనే ప్రస్తావిస్తాం. సీఎం చంద్రబాబును నేరుగా కలిసే అవకాశం మాకు దొరకదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా బిజీగా ఉంటారు. కనుక మా సమస్యలను జనార్దన్తో చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబు వద్ద ఆ సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తారు’ అని సెబాస్టియన్ పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయస్థానానికి ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్ అనే వ్యక్తి ఎవ రని విలేకరులు ప్రశ్నించగా సెబాస్టియన్ పైవిధంగా స్పందించారు. అయితే ఈ కేసుతో జనార్దన్కు ఏలాంటి సంబంధం లేదన్నారు. ఏసీబీ కావాలనే తమను కుట్రపూరితంగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించిందన్నారు. తమ ఫోన్లను ఏసీబీ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. తన ఫోన్లో ఎలాంటి సంభాషణలూ రికార్డు కాలేదని, అవన్నీ ఏసీబీ సృష్టిస్తున్న కట్టుకథలని సెబాస్టియన్ చెప్పుకొచ్చారు. -
పవన్ కల్యాణ్కు మంత్రి హరీశ్రావు చురక
పుల్కల్: ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను ఉద్దేశపూర్వకంగానే ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించడం సరైంది కాదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం సింగూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ టీడీపీపై వ్యాఖ్యానించకుండా టీఆర్ఎస్ టార్గెట్గా విమర్శలు చేయడం పవన్కు తగదన్నారు. పవన్ కల్యాణ్ తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను అభినందిస్తూనే మరోవైపు విమర్శించడం భావ్యం కాదన్నారు. -
మత్తయ్య అరెస్ట్పై హైకోర్టు స్టే
* 24 వరకు అరెస్ట్ వద్దని ఏసీబీకి ఆదేశం * హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరూసలేం మత్తయ్య అరెస్ట్పై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 24 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ శివశంకరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మత్తయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ శివశంకరరావు విచారించారు. మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, స్పెషల్ పీపీ వి.రవికిరణ్రావు తమ తమ వాదనలు వినిపించారు. ముందుగా సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో నిందితులను ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఫిర్యాదుదారు స్టీఫెన్సన్ మత్తయ్య తదితరులను పిలిచి ఓటు గురించి మాట్లాడారని తెలిపారు. చట్టప్రకారం ఈ కేసులో మత్తయ్యే కాక నేరానికి ప్రేరేపించిన స్టీఫెన్సన్ శిక్షార్హుడేనన్నారు. ఈ సమయంలో ఏజీ రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టును కోరారు. దీనికి న్యాయమూర్తి, ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు వినేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని, కౌంటర్ దాఖలుకు గడువు కావాలంటే అప్పటి వరకు పిటిషనర్ అరెస్ట్పై స్టే ఇస్తానని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఏజీ చెప్పడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ, అప్పటి వరకు మత్తయ్యను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దురుద్దేశాలతోనే కేసు... గత నెల 28న స్టీఫెన్సన్ ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీని వెనుక దురుద్దేశాలున్నాయని మత్తయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలు, అవకతవకలు అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని తెలిపారు. ప్రస్తుత కేసులో తనకు ఐపీసీ సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని, అవి బెయిల్ మంజూరు చేయదగిన నేరాలని వివరించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేయడానికీ, దర్యాప్తు చేయడానికీ ముందు కోర్టు అనుమతి తీసుకోలేదని, ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఈ కేసులో స్టీఫెన్సన్ ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయకుండా, ఏసీబీ అధికారులను ఆశ్రయించారని, దురుద్దేశపూరితంగా ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఇలా చేశారని తెలిపారు.