breaking news
volleyball player
-
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్లాండ్కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్నగర్లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్నెస్పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్నెస్పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
క్రీడాకారిణిపై కోచ్ అఘాయిత్యం
చండీగఢ్ : తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణి ఫిర్యాదు చేయడం హరియాణాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమెపై కన్నేసిన కోచ్ గౌరవ్ దేశ్వాల్ గత రెండున్నరేళ్లుగా అనేక సార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉన్నారు. తన భవిష్యత్తు దృష్ట్యాలో ఉంచుకొని ఆ బాలిక ఇన్ని రోజులు వేధింపులను భరించారు.. అయితే ఇటీవలే కోచ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గౌరవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్ను అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
తప్పుగా అర్థం చేసుకోకండి : పీవీ సింధూ
తనను వాలీబాల్ ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించిన ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను పీవీ సింధూ వెనకేసుకొచ్చారు. తాను వాలీ బాల్ ప్లేయర్ అని చెప్పడం ఎమ్మెల్యే సర్ ఉద్దేశం కాదని సింధూ ట్విట్టర్లో పేర్కొన్నారు. స్టేజీ పైనే ఉన్న తన తండ్రిని ఉద్దేశించి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అన్నారని, ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోకండి అని తెలిపారు. చార్మినార్లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించిన విషయం తెలిసిందే. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ సీఎం చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. అయితే ముంతాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు సంధిస్తున్నారు. ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్తో ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను పోల్చుతున్నారు. ఒలింపిక్స్లో మెడల్ తీసుకువచ్చిన పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారని నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. Here MLA sir doesn't mean that I am a volleyball player.He has expressed my dad's presence on the stage as national volleyball player.(1/2) pic.twitter.com/akm27Hxri6 — Pvsindhu (@Pvsindhu1) February 19, 2017 -
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి. -
వాలీబాల్ ఆడుతుంటే.. నరికి చంపేశాడు!
పశ్చిమబెంగాల్ రాజధానిలో అమ్మాయిల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. 30 మందితో కలిసి వాలీబాల్ ఆడుతున్న ఓ టీనేజి అమ్మాయిని ఓ యువకుడు మాంసం కత్తితో నరికి చంపేశాడు. సంగీతా ఐచ్ (14) స్థానిక స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె మంచి క్రీడాకారిణి. మర్నాడు మ్యాచ్ ఉందని 30 మంది అమ్మాయిలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా.. సుబ్రత సింఘ అనే యువకుడు ఆమె వద్దకు వచ్చి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆమె దాన్ని తిరస్కరించడంతో వెంటనే గొడ్డలితో నరికేశాడు. సంగీతను కాపాడేందుకు అక్కడే ఉన్న కోచ్ స్వపన్ దాస్ ప్రయత్నించారు. తాను కూర్చున్న కుర్చీ తీసుకుని దాంతోనే సుబ్రతను కొట్టాలని చూశారు. సంగీత అక్కడకు దగ్గర్లోనే ఉన్న తన ఇంటివైపు పారిపోవడం మొదలుపెట్టింది. ఈలోపే సుబ్రత ఆమెను పట్టుకుని, పలుమార్లు నరికేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంగీత అక్కడే ఉండి ఉంటే అతడు ముందు తనను చంపడానికి వచ్చేవాడని, కానీ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వెంటబడి మరీ చంపేశాడని కోచ్ తెలిపారు. ఈ దారుణ హత్య చూసి.. ఆమెతోపాటు వాలీబాల్ ఆడుతున్న కొందరు అమ్మాయిలు కళ్లుతిరిగి పడిపోయారు. స్థానికులు కూడా సుబ్రతను పట్టుకునేందుకు భయపడ్డారు. సంగీత బాబాయ్ గోపాల్కు అక్కడకు దగ్గర్లోనే ఫుడ్ స్టాల్ ఉంది. విషయం తెలిసి వెంటనే వచ్చి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా ఆటోవాళ్లు ఎవరూ రాలేదు. చివరకు ఒక ఆటో రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె మరణించింది.