breaking news
Vidyalaksmi scheme
-
విద్యా రుణానికి మెరుగైన మార్గం
పేరున్న విద్యా సంస్థల్లో చదవడం ద్వారా తమ కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థుల్లో ఉంటుంది. కానీ, అందరికీ తగినంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. పైగా విద్యా వ్యయాలు ఏటేటా భారీగానే పెరిగిపోతున్న పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే అభిలాష కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. అయితే, ఇందుకోసం అయ్యేంత ఖర్చు సొంతంగా భరించే సామర్థ్యం లేదని వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ఓ మంచి మార్గం. 2015లో సగటు విద్యా రుణం సైజు రూ.5.73 లక్షలుగా ఉంటే, 2018లో రూ.8.5 లక్షలకు పెరిగినట్టు ట్రాన్స్ యూనియన్ సిబిల్ డేటా తెలియజేస్తోంది. మూడేళ్లలోనే 45 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కనుక భారీ వ్యయాల కోసం రుణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల ఉన్నత విద్య కోసం రుణాలు తీసుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది. విద్యా రుణం తీసుకోవడానికి ముందు ప్రతీ ఒక్కరూ ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంది, చెల్లింపుల సౌలభ్యాన్ని విచారించుకోవడం ఎంతైనా అవసరం. రుణాలపై వడ్డీ రేట్ల వివరాలను ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వెబ్సైట్ల సాయంతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా ఈ విషయంలో పూర్తి సహకారం కూడా అందిస్తోంది. విద్యా రుణం గురించి వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు తీరు తెన్నులను ట్రాక్ చేసుకునేందుకు ఈ పోర్టల్ సాయపడుతుంది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో, చెల్లింపుల పరంగా సౌకర్యంగా ఉన్న బ్యాంకు నుంచి రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్జిన్ మనీ కోర్సు ఫీజుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు నూరు శాతం వరకు రుణాన్ని సర్దుబాటు చేస్తాయి. అయితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. రూ.4 లక్షల వరకు రుణానికి మార్జిన్ మనీ (సొంతంగా సమకూర్చుకోవాల్సిన మొత్తం) అవసరం. దేశీయంగానే ఉన్నత విద్య చదవాలనుకుంటే అందుకు అయ్యే వ్యయంలో 5 శాతాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాలి. అదే విదేశాల్లో విద్య కోసం రుణం తీసుకునేవారు 15% మార్జిన్ మనీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా రుణం మొత్తం రూ.4లక్షల కు మించకపోతే బ్యాంకులు హామీ కోరవు. రూ.4లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య ఉంటే హామీదారును అడుగుతాయి. రూ.7.5 లక్షలకు మించి రుణం తీసుకోదలిస్తే ఆస్తులను తనఖాగా ఉంచాలని కోరతాయి. రుణాల చెల్లింపుల్లో వైఫల్యం చోటు చేసుకుంటే వసూలు కోసం వీటిని కోరడం జరుగుతుంది. క్రెడిట్ స్కోర్ సాధారణంగా విద్యారుణం తీసుకునే వారికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు గ్యారంటార్గా ఉంటారు. విద్యార్థికి క్రెడిట్ స్కోరు ఉండదు కనుక కుటుంబ సభ్యుల్లో ఒకరు గ్యారంటార్గా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో హామీదారుగా ఉండేందుకు ముందుకు వచ్చే వారికి క్రెడిట్ స్కోరు తగినంత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా చూసుకోవచ్చు. 750పైన క్రెడిట్ స్కోరు ఉంటే రుణం సులభంగా రావడంతోపాటు, వడ్డీ రేటు తక్కువకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. లేదంటే పిల్లల విద్యావకాశాలపై ప్రతికూలత ఏర్పడుతుంది. దరఖాస్తుదారు విద్యాలక్ష్మి పోర్టల్లో తప్పకుండా నమోదు చేసుకోవాలి. కామన్ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన వివరాలన్నింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం దరఖాస్తుదారుడు విద్యా రుణం కోసం పోర్టల్లో సెర్చ్ చేసి, తన అవసరాలు, సౌలభ్యాలకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి చేసే దరఖాస్తు పత్రాన్ని అన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే దీన్ని ఉమ్మడి దరఖాస్తు పత్రంగా పేర్కొన్నారు. సక్రమంగా చెల్లింపులు మొదటి నెల నుంచే తీసుకున్న రుణంపై వడ్డీ జమ అవడం మొదలవుతుంది. కాకపోతే రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐల చెల్లింపులు మొదలు కావడానికి మధ్యలో గ్రేడ్ పీరియడ్ ఉంటుంది. విద్యార్థి కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత సాధారణంగా ఒక ఏడాది పాటు ఇది ఉంటుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ భారం పెరిగిపోకుండా, వేగంగా రుణ చెల్లింపులు పూర్తయ్యేందుకు గాను తల్లిదండ్రులు ప్రతీ నెలా కొంత మేర చెల్లించడం మంచి ప్రణాళిక అవుతుంది. అదనపు ప్రయోజనాలు విద్యా రుణం తీసుకోవడం వల్ల పన్ను ఆదా వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చెల్లించే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు పొందొచ్చు. విద్యా రుణం తీసుకుని, సక్రమ చెల్లింపులు చేయడం వల్ల మంచి క్రెడిట్ స్కోరు కూడా నమోదవుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పిల్లల విద్యా రుణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. -
ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!
ఇంజనీరింగ్ స్పెషల్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ముగిసింది.. త్వరలోనే ఫలితాలు.. ఆ తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపరుస్తున్న అంశం.. ఐఐటీల్లో ఫీజుల పెంపు! ఐఐటీల్లో బీటెక్ ఫీజులు రెట్టింపు చేస్తూ గత నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఐఐటీల్లో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలపై విశ్లేషణ... స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐఐటీల్లో బీటెక్ ఫీజులను రూ.90 వేల నుంచి రూ. రెండు లక్షలకు పెంచింది. వాస్తవానికి ఫీజును రూ. మూడు లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా.. రూ. రెండు లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు కాస్తలో కాస్త ఊరట. ఫీజుల పెంపునకు కారణాలు ఐఐటీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనపై గతేడాది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఐఐటీ -చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ డెరైక్టర్ల నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ ఫీజుల పెంపుపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రూ.3లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఐఐటీలు ఏటా ఒక్కో విద్యార్థిపై వెచ్చిస్తున్న వ్యయాన్ని, ఇతర నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచినట్లు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని, ఐఐటీ చదువులు ఆర్థిక భారమనే ఒత్తిడికి లోనవనక్కర్లేదని కేంద్రం పేర్కొనడం విశేషం. 70 శాతం మందికి మినహాయింపు! * ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం ఉన్నవారికి ఫీజు నుంచి పూర్తి రాయితీ. * కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న విద్యార్థులకు వారి సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మేరకు (66 శాతం) మినహాయింపు ఉంటుంది. * ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పథకం ఫీజుల భారం నేరుగా భరించే విద్యార్థుల కోసం తాజా ప్రతిపాదన విద్యాలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం. దీని ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన రోజే వడ్డీ రహిత స్కాలర్షిప్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చించి బ్యాంకుల సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు సైతం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేవి.. రీసెర్చ్ అసిస్టెన్స్షిప్, టీచింగ్ అసిస్టెన్స్షిప్. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్షిప్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు దాదాపు 23 స్కాలర్షిప్ పథకాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు తమ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం https://scholarships.gov.in చూడొచ్చు. రెండు వేల కోట్లతో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ రూ.రెండు వేల కోట్ల కార్పస్తో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ(న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా ఐఐటీల్లో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, ఇతర నిర్వహణ వ్యయాలకు వడ్డీ రహిత రుణాలు అందించాలని సూచించింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, కేబినెట్ ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది. విదేశీ విద్యార్థులకు సైతం పెరిగిన ఫీజులు ఐఐటీల్లో అడ్మిషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ పేరుతో మొత్తం సీట్లకు అదనంగా పది శాతానికి మించకుండా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వీరికి ప్రస్తుతం 4 వేల యూఎస్ డాలర్లుగా ఉన్న వార్షిక ఫీజును పది వేల డాలర్లకు పెంచారు. ఇతర ఖర్చులకు సిద్ధంగా ఉండాలి ఫీజుల విషయంలో రాయితీలు పొందే విద్యార్థులు ఇతర ఖర్చుల విషయంలో మాత్రం స్వయంగా వనరులు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశించే సమయంలో లైబ్రరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు, వన్ టైం కాషన్ డిపాజిట్ వంటి వాటికోసం నగదును దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ అకామడేషన్ ఫీజు పరంగానూ సొంత నిధులు సమకూర్చుకోవాలి. ఈ ఇతర వ్యయాలు పరిగణనలోకి తీసుకుంటే ఐఐటీల్లో ప్రతి సెమిస్టర్కు విద్యార్థులకు అవుతున్న వ్యయం రూ. 30 వేల వరకు ఉంటోంది. ఆ మేరకు నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యం ఐఐటీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. వీరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఫీజుల పెంపునకు కారణం ఐఐటీలకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కల్పించడమే. అంతేకానీ విద్యార్థులపై భారం మోపడం ఉద్దేశం కాదు. పెంచే ఫీజుల వల్ల ఆయా ఐఐటీల్లో నిర్వహణ వ్యయం లభిస్తుంది. తద్వారా పలు అనవసర జాప్యాలను నివారించొచ్చు. - ప్రొఫెసర్. కె.ఎన్. సత్యనారాయణ, ఐఐటీ-తిరుపతి క్యాంపస్ ఇన్ఛార్జ్.