breaking news
Varsham movie
-
హిట్ బొమ్మలు 'రీ రిలీజ్'
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. అదే కోవలో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజు కావచ్చు.. లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. లేకుంటే ఆ సినిమాకి ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆ కోవలో భాగంగా ఈ నెలలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, దేశముదురు, జల్సా, యమదొంగ, వర్షం, ఖలేజా’ వంటి హిట్ బొమ్మలు (చిత్రాలు) ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.... ముప్పై ఐదేళ్ల తర్వాత... ముప్పై ఐదేళ్ల తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్గా నటించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ షాలినీ, బేబీ షామిలీ వంటి వారు కీలకపాత్రలుపోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా 1990 మే 9న విడుదలైంది.సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోనిపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నేడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. అప్పట్లో ఈ సినిమాని రీల్ రూపంలో ప్రదర్శించారు. అయితే ఇప్పుడంతా డిజిటల్ మయం కావడంతో రీల్లో రిలీజ్ చేయడం కుదరదు.అందుకే 2018 నుంచి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టిన యూనిట్కి.. 2021లో విజయవాడలోని అ΄్పారావు అనే వ్యక్తి వద్ద ఒక ప్రింట్ రీల్ దొరికింది. ఆ రీల్ కూడా దుమ్ము, ధూళి పట్టడం.. అక్కడక్కడా గీతలు పడటంతో పెరిగిన సాంకేతికతని బేస్ చేసుకుని ఎంతో శ్రమించి రీల్లోని ఈ సినిమాని 8కే రెజల్యూషన్లో డిజిటలైజ్ చేసి 4కే ఔట్పుట్గా మార్చారు మేకర్స్. ఈ ప్రింట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది. 2డీతోపాటు ఈ చిత్రం 3డిలోనూ విడుదల కానుండటం విశేషం.దేశముదురు మళ్లీ వస్తున్నాడు... తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరోసారి వస్తున్నాడు దేశముదురు. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘దేశముదురు’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా హన్సిక టాలీవుడ్కి పరిచయమయ్యారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2007 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమాలో తొలిసారి సిక్స్ప్యాక్ బాడీలో కనిపించారు అల్లు అర్జున్. సన్యాసిగా మారిన వైశాలిని (హన్సిక) ప్రేమించి, ఆ ప్రేమకథను సుఖాంతం చేసుకునే బాల గోవింద్పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఈ చిత్రానికి దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పట్లో ఈ సినిమాలోనిపాటలు ట్రెండ్సెట్టర్గా నిలిచాయనడం అతిశయోక్తి కాదు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ సినిమా పద్దెనిమిదేళ్ల తర్వాత రీ రిలీజ్కి ముస్తాబైంది. ఈ నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మేకర్స్. కరో కరో జల్సా... ‘హే సరిగమ పదనిస కరో కరో జర జల్సా...’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’. ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలోపార్వతీ మిల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, అలీ, ముఖేష్ రిషి వంటి వారు కీలకపాత్రలుపోషించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2008 ఏప్రిల్ 1న రిలీజై హిట్గా నిలిచింది. నక్సలైట్ (మావోయిస్టు) నుంచి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన సంజయ్ సాహుపాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్లస్గా మారింది. 17ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ నెల 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. పుట్టినరోజు కానుకగా... ‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో... పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు... సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ అంటూ ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఎంతపాపులర్ అయ్యాయో తెలిసిందే. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమదొంగ’. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్గా నటించగా మంచు మోహన్బాబు, మమతా మోహన్దాస్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఖుష్బు వంటి వారు కీలకపాత్రలుపోషించారు.హీరోయిన్ రంభ ఈ చిత్రంలో ‘నాచోరే నాచోరే...’ అంటూ ఎన్టీఆర్తో కలిసి తనదైన డ్యాన్సుతో అదరగొట్టారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాజా అనే దొంగపాత్రలో ఎన్టీఆర్ నటించారు. యమధర్మ రాజుపాత్రలో మోహన్బాబు నట విశ్వరూపం చూపించారు. రమా రాజమౌళి సమర్పణలో చెర్రీ, ఊర్మిళ నిర్మించిన ఈ సినిమా 2007 ఆగస్టు 15న రిలీజై సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం కూడా ప్లస్ అయ్యింది. ఈ సినిమాని 17 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు.వర్షం వస్తోంది... మండు వేసవిలో థియేటర్లలో ప్రేక్షకులపై చల్లని వర్షపు జల్లులు కురిపించనున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘వర్షం’. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. హీరో గోపీచంద్ విలన్పాత్రపోషించారు. ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘ఈశ్వర్, రాఘవేంద్ర’ వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన మూడో చిత్రం ‘వర్షం’. ఈ చిత్రం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది.అంతేకాదు కెరీర్ ఆరంభంలో యూత్లో ప్రభాస్కు మంచి ఫాలోయింగ్ని, ఫ్యాన్స్ని తెచ్చిపెట్టిన చిత్రం ఇదే. వెంకట్ (ప్రభాస్), శైలు (త్రిష) ప్రేమకథకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రభాస్–గోపీచంద్ మధ్య వచ్చేపోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా 25 ఏళ్ల తర్వాత ‘వర్షం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 23న 4కే వెర్షన్లో ఈ సినిమా విడుదలవుతోంది. మళ్లీ ఖలేజా... హీరో మహేశ్బాబు ఖలేజా చూపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్బాబు, అనుష్క జోడీగా నటించిన చిత్రం ‘ఖలేజా’. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ప్రకాశ్రాజ్, రావు రమేశ్ కీలకపాత్రలుపోషించారు. ఎస్. సత్యరామ్మూర్తి సమర్పణలో సింగనమల రమేశ్బాబు, సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం 2010 అక్టోబరు 7న విడుదలైంది. మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడం, మణిశర్మ సంగీతంలోనిపాటలకు మంచి స్పందన రావడం... వంటి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వెండితెర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.కానీ, బుల్లితెర ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమాని విరగబడి చూసేవాళ్లు ఉన్నారనడం అతిశయోక్తి కాదేమో. బహుశా.. అందుకేనేమో.... పద్నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాని మరోసారి వెండితెర ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ నెల 30న ‘ఖలేజా’ రీ రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి... ప్రచారంలో ఉన్నట్లు ‘ఖలేజా’ ఈ నెల 30న రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాలి. బాహుబలి రిటర్న్స్ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రం తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న విడుదల కాగా, రెండోభాగం ‘బాహుబలి: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ రెండు చిత్రాలూ బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబరులో ‘బాహుబలి’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ అధికారికంగా ప్రకటించారు. అదికూడా కేవలం ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా రీ రిలీజ్ చేయనున్నారు. అయితే రీ రిలీజ్లో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉంటాయని ఆయన చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే విడుదల తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అతడొస్తున్నాడుమహేశ్బాబు కెరీర్లో హిట్గా నిలిచిన చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. మహేశ్బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రమిది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం వంటి వారు కీలకపాత్రలుపోషించారు. దుగ్గిరాల కిశోర్, రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2005 ఆగస్టు 10న విడుదలై, హిట్గా నిలిచింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. అది కూడా మహేశ్బాబు బర్త్డే కానుకగా. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అతడు’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు... ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ వెర్షన్లోకి మార్చి 4కె, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా రీ రిలీజ్ విషయంలోనూ మహేశ్బాబు సరికొత్త ట్రెండ్ను క్రియేట్ చేయబోతున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
45 రోజులు వర్షంలో షూటింగ్.. ఆ సినిమా మానేసి వెళ్లిపోదాం అనుకున్నా : త్రిష
‘నా కెరీర్లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు. ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. -
ప్రభాస్ అక్కగా యాంకర్ సుమ.. ఆ సినిమా పేరేంటో తెలుసా?
ఎక్కడ చూసినాసరే హీరో ప్రభాస్ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. 'ఆదిపురుష్'పై వివాదాలు, మరోవైపు 'సలార్' రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఇలా డార్లింగ్ హీరోని సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మార్చేశాయి. ఇదే టైంలో ప్రభాస్ గురించి ఓ విషయం వైరల్ అవుతోంది. ఓ చిత్రంలో ప్రభాస్కి అక్కగా యాంకర్ సుమ నటించిందని అంటున్నారు. మరి ఆ మూవీ ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? (ఇదీ చదవండి: 'సలార్' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకేమో టెన్షన్!) తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది సుమ కనకాల. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ మనలో కలిసిపోయింది. నటుడు రాజీవ్ కనకాలని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాలు, సీరియల్స్ లో నటించిన సుమ.. ఆ తర్వాత మాత్రం రూట్ మార్చి యాంకర్ గా సెటిలైపోయింది. గతేడాది 'జయమ్మ పంచాయతీ' చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. లీడ్ రోల్ లో నటించింది గానీ హిట్ కొట్టలేకపోయింది. సరే అసలు విషయానికొచ్చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'ఈశ్వర్'తో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ 'వర్షం'తో తొలి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోనే ప్రభాస్ కి అక్కగా సుమ నటించింది. కాకపోతే అది ఆమె కెరీర్ ప్రారంభంలో కావడంతో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. 'రామబాణం' ప్రమోషన్స్ టైంలోనూ గోపీచంద్ ఇదే విషయమై సుమని ఆటపట్టించాడు! బహుశా స్టోరీ చదువుతున్న మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు!? (ఇదీ చదవండి: మొదటి ముద్దు.. డెటాల్తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి) -
విరహం అయినా..విషాదం అయినా 'వాన' ఉండాల్సిందే..
‘‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’’... శంకరశాస్త్రికి కూడా వాన సాయం కావాల్సి వచ్చింది. ‘‘ఆ రెండి నట్టనడుమ నీకెందుకింత తపన’’... నాట్య కళాకారుడు బాలు బావి గట్టుమీద వాననే సవాలు చేశాడు. జగపతి వారి చిటపట చినుకులు నుంచి ‘‘ఈ వర్షానికి స్పర్శుంటే..’’ పాట వరకు ఎన్నో సందర్భాల్లో వాన హార్మోనియం మెట్లను తడిపింది.. కలెక్షన్ల బాక్సుల్ని నింపింది. ఒక వాన విహారం... ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రిని జనం సందేహించారు. అతడి శీలాన్ని శంకించారు. శంకర శాస్త్రి ఏమిటి... పరాయి స్త్రీని తన పక్కన కచ్చేరీకి కూచోబెట్టుకోవడం ఏమిటి? కాని నిప్పులాంటి శంకర శాస్త్రికి తానేమిటో తెలుసు. ఆ సంగతి శంకరుడికీ తెలుసు. అందుకే ఆ శంకరుడితో తన ఆగ్రహాన్ని చెప్పుకున్నాడు. గానం చేశాడు. ఇంతటి ఆగ్రహ జ్వాల లోకాన్ని ఏం చేయాలని? అతణ్ణి చల్లబరచాలే. అందుకే గంగ దూకింది. మెరుపులు మెరిశాయి. ఉరుములు ఫెటిల్మన్నాయి. ‘శంకరా నాదశరీరాపరా’... గానవాహిని కొనసాగింది. వాన లేకపోతే ఆ పాటకు బలం లేదు. వాన ఆ పాటకూ పాత్రకూ శక్తినిచ్చింది. వాన.. శక్తి. వానను దుబారా చేయకూడదు. సరిౖయెన సమయంలో నేలకు దించాలి. ఝల్లుమనిపించాలి. గుండె తడిపించాలి. ‘సాగర సంగమం’లో విఫల ప్రేమికుడు, పరాజిత కళాకారుడు అయిన బాలుకు మందు తప్ప మరో తోడు లేదు. అతడు తాగి తాగి చనిపోబోతున్నాడు. చనిపోయేవాడికి భయం ఏమిటి? రెండు గుక్కలు తాగి బావి గట్టున ఎక్కితే? మనసు ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ అంటే? కాని అతణ్ణి ఆపాలి. ఆపాలంటే ఆమె రావాలి. రావాలంటే వాన రావాలి. వానలో అతడికి ప్రమాదమేమో అని ఆమె వొణికిపోవాలి. అప్పుడు వితంతువు అయిన ఆమె బొట్టు పెట్టుకుంటుంది. అతడు దానికి అరచేయి అడ్డుపెడతాడు. వాన వారి గత జ్ఞాపకాలను తడుపుతూ కురుస్తుంది. మనోజ్వరం ఆ సన్నివేశానిది.వానలో అందరం తడుస్తాము. కాని వయసులో ఉన్నప్పుడు, జోడు తోడుగా ఉన్నప్పుడు తడవడం అందరికీ కుదరదు. కనుక సినిమాలో అలాంటి జోడి తడిస్తే సంతోషపడతాము. ముచ్చటపడతాము. ఆ అచ్చట్లు ముచ్చట్లు తీసి నాలుగు డబ్బులు రాబట్టుకునే సినిమావారు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని వానను తెర మీదకు తెచ్చారు. ‘ముత్యాల జల్లు కురిసే’ అని హీరోయిన్ను మైమరిపించారు. సందర్భాలను సృష్టించి సంగీత దర్శకులకు సవాలు విసిరారు. వారు అందుకు సరేగమా అన్నారు. ‘ప్రేమ్నగర్’లో శ్రీమంతుల కుర్రాడు తన దగ్గర సెక్రటరీగా పని చేసే అమ్మాయిని వానలో తడిచి చూసే మోహిస్తాడు. బయట వాన కురుస్తుంటే లోపల పాట. హార్మోనియం పలికింది. ‘తేట తేట తెలుగులా’ అని ఉత్ప్రేక్షల కుంభవృష్టి కురిసింది.లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఎలాగూ కన్నీళ్లు వస్తాయి. ఆ బాధా సమయంలో వాన కూడా వస్తే ఇక వరదే. ఆ రేంజ్ కావాలంటే కేరళ నుంచి ఏసుదాస్ రావాల్సిందే. ‘స్వయంవరం’లో ‘గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం’... ఆ పాట హోరు సులువుగా వదిలిపోదు. వాన ఎందుకనో ఆడపిల్లల నేస్తం. వాన వస్తే అమ్మాయిలు పాడతారు. ‘మౌనరాగం’లో ‘అహో మేఘమొచ్చెనే’ అని రేవతి పాడుతుంది. ‘గీతాంజలి’లో ‘వొళ్లంత జల్లంత కావాలిలే’ అని గిరిజ పాడుతుంది. ‘వర్షం’లో ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అని త్రిష పాడుతుంది. ‘వచ్చె వచ్చె నల్ల మబ్బుల్లారా’ అని ‘ఆనంద్’లో కమలిని ముఖర్జీ పాడుతుంది. కె.వి.మహదేవన్ నుంచి కె.ఎం. రాధాకృష్ణన్ వరకు వానమీటలు మీటిన వారే. హీరో ఎంతటివాడైనా హీరోయిన్ ఎవ్వరైనా వాన ఉంటే ఆ ఫీల్ వేరు. ఆడియెన్స్కు ఆ థ్రిల్ వేరు. ఎన్.టి.ఆర్–శ్రీదేవి ‘ఆకు చాటు పిందె తడిసె’ అనాల్సిందే. అక్కినేని–శ్రీదేవి ‘చిటపట చినుకుల మేళం’ అని పాడాల్సిందే. చిరంజీవి– రాధ ‘వానా వానా వందనం’ అంటే ‘అడవి దొంగ’ పెద్ద హిట్ అయ్యింది. వాణి విశ్వనాథ్తో ఆయనే పాడిన ‘అబ్బా.. ఇది ఏమి వాన’ పాట ‘ఘరానా అల్లుడు’కు కిక్ ఇచ్చింది. ‘స్వాతి ముత్యపు జల్లుల’లో (నాగార్జున), ‘స్వాతిలో ముత్యమంత’ (బాలకృష్ణ), ‘చిత్తడి చిత్తడి వాన’ (సుమన్).. ఆ వానలాహిరి అలా సాగిపోతూనే వచ్చింది.ఆకాశం ఆనాటిదే. ప్రేమా ఈనాటిదే. వాన ఏనాటిదే. అందుకే కొత్తతరం వచ్చినా వానచప్పుడు ప్రేమచప్పుడు సినిమాల్లో వినిపిస్తూనే ఉంది. వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’లో ‘ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా’ పాట అందరినీ అందుకే తడిపింది. వానలో ఒక లయ, సవ్వడి ఉంటుంది. ఆ సంగీతం ఎప్పుడైనా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా కోసం అది ట్యూన్లో కురిసినప్పుడు. ఆకాశగంగా... దూకావె పెంకితనంగాఆకాశగంగా జలజలజడిగా తొలిఅలజడిగా... -
తడిపి తడిపి తనతో నడిపి..
సినిమా వెనుక స్టోరీ - 22 హైదరాబాద్లో వర్షం అనుకోని అతిథి లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ రోజు అలానే ఊహించని విధంగా వర్షం కురిసింది. ఎమ్మెస్ రాజు కారు బంజారా హిల్స్ రోడ్లమీద వేగంగా పరిగెడుతోంది. ఆయనప్పుడే సూర్యనారాయణరాజుని కలిసి వస్తున్నారు. సూర్యనారాయణరాజు అంటే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుకి సొంత తమ్ముడు. వాళ్లబ్బాయ్ ప్రభాస్ అప్పుడే హీరోగా ఎంటరయ్యాడు. ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’... రెండు సినిమాలు చేశాడు. ‘‘మావాణ్ణి మీ చేతుల్లో పెడు తున్నాను. ఎలా చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం’’ అన్నారు సూర్యనారాయణరాజు. అంత ఫ్రీడమ్ ఇస్తే ఎమ్మెస్ రాజు లాంటి ఫిల్మ్మేకర్కి ఫుల్ హ్యాపీ. దాంతో పాటే కొండంత ఒత్తిడి కూడాను. ‘‘నన్ను నమ్మి వాళ్లబ్బాయిని అప్పగిస్తున్నారు. ఎలాగైనా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి.’’ కారు కన్నా వేగంగా పరుగులు తీస్తోంది ఎమ్మెస్ రాజు మనసు. వర్షం వెలిసి పోవడంతో హైదరాబాద్ తడితడి అందాలతో మెరిసిపోతోంది. ‘ఒక్కడు’ ఆల్టైమ్ సూపర్హిట్. ఎమ్మెస్ రాజు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంతా వెయిటింగ్. ఎమ్మెస్ రాజు ఎక్కువ మాట్లాడరు. ఆయన చేతల మనిషి. ఏం చేసినా సెలైంట్గానే చేస్తారు. ప్రభాస్తో పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేస్తున్నారాయన. పరుచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అసిస్టెంట్. ఫుల్ జెమ్. అతనో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు. ఎమ్మెస్ రాజుకి విపరీతంగా నచ్చేసింది. దాని చుట్టూరా స్క్రిప్టు అల్లుతున్నారు. రామాయణం లాంటి కథ. సీతను రావణుడు మోహించి లంకలో బంధిస్తాడు. ఆ లంక నుంచి సీతను విడిపించడమే రాముడి లక్ష్యం. సేమ్ టు సేమ్ అలాంటి ప్యాట్రనే. ఓ అందమైన అమ్మాయి. ఆమె చుట్టూ గుడ్, బ్యాడ్, అగ్లీ క్యారెక్టర్స్. గుడ్ అంటే హీరో. బ్యాడ్ అంటే విలన్. అగ్లీ అంటే హీరోయిన్ ఫాదర్. ఈ నలుగురితో పాటు వర్షానిది కూడా ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఓకే. కానీ బ్యాక్డ్రాప్ అదిరి పోవాలి. ఇంతవరకూ ఏ సినిమాలోనూ వచ్చి ఉండకూడదు. ఏవేవో ఆలోచిస్తుంటే ఫైనల్గా దొరికింది. వరంగల్ బ్యాక్డ్రాప్. వేయి స్తంభాల గుడి, మిగతా హిస్టారికల్ ప్లేసెస్. ఆడియన్స్కి ఇంట్రస్టింగ్గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్క్లూడ్ చేసు కుంటూ స్టోరీ సెట్ చేశారు. హిందీ సినిమా ‘తేజాబ్’లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్గా ఉంటాయి. కూతుర్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడు కావాలని కలలు కనే తండ్రిగా అనుపమ్ ఖేర్ చేశాడు. అందులో అనిల్కపూర్ - మాధురీ దీక్షిత్ మనస్పర్థలొచ్చి విడిపోతారు. వీటన్నిటి ఇన్స్పిరేషన్తో స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. ఇంతకూ ఈ కథను ఎమ్మెస్ రాజు ఎవరితో డెరైక్ట్ చేయిస్తారు? ఎవరా లక్కీ గై? ‘బాబి’ సినిమా డిజాస్టర్ కావడంతో డెరైక్టర్ శోభన్ పాపం ఫుల్లీ డిప్రెస్డ్. అలాంటి టైమ్లో ఎమ్మెస్ రాజు నుంచి ఫోన్. పోన్లే... తుపాన్ టైమ్లో రొట్టె ముక్క అయినా దొరుకుతోంది. డెరైక్టర్గా ఎలాగూ భవిష్యత్తు లేదు. రైటర్గానైనా స్థిరపడదాం... శోభన్ ఊపిరి పీల్చుకున్నాడు. జీరో క్యాండిల్ బల్బులాగా సుమంత్ ఆర్ట్స్ ఆఫీసులోకి అడుగుపెట్టినవాడు, ఫ్లడ్ లైట్లాగా బయటికొచ్చాడు. నెవర్ ఎక్స్పెక్టింగ్ ఆఫర్. ప్రభాస్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేయమంటారనుకుంటే... ఏకంగా డెరైక్షన్ ఆఫర్ ఇచ్చారు. స్టార్ కాని ప్రభాస్తో... అట్టర్ ఫ్లాప్ డెరైక్టర్తో... ఎమ్మెస్ రాజు సినిమానా? మరీ ఇంత మొండి ధైర్యమా? ఈ టైమ్లో ఏటికి ఎదురీదడం అవసరమా? ఈ కామెంట్స్ అన్నీ ఎమ్మెస్ రాజు చెవిన పడుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరాయన. ఓ పక్క స్క్రిప్ట్ ఫైనల్ డిస్కషన్స్. మరోపక్క కాస్టింగ్ సెలెక్షన్. కె. రాఘవేంద్రరావు ‘గంగోత్రి’ సినిమాలో ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదితీ అగర్వాల్. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ సిస్టర్. అదిరిపోయేలా ఉందని టాక్. ప్రభాస్ పక్కన బాగానే ఉండేట్టు ఉంది. కానీ ‘గంగోత్రి’ కంప్లీట్ అయితే తప్ప, డేట్స్ దొరకవు. వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. చెన్నైలో ‘నాని’ షూటింగ్. సరదాగా మహేశ్ని కలవడానికెళ్లారు ఎమ్మెస్ రాజు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కెళ్తుంటే - జెమినీ ఫ్లై ఓవర్ దగ్గర అప్పుడే ఓ కొత్త సినిమా వినైల్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో మెరుపులాగా ఓ అమ్మాయి కనిపించింది. ఎమ్మెస్ రాజు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. విక్రమ్ పక్కన ‘సామి’ అనే తమిళ సినిమాలో చేస్తోందట. తెలుగులో కూడా ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా చేస్తోంది. ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ద్వారా ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. వెంటనే లైన్లోకొచ్చిందా అమ్మాయి. ఎమ్మెస్ రాజు చూచాయగా కథ చెబితే థ్రిల్లయిపోయింది. ఆ అమ్మాయే త్రిష. శైలజ పాత్రకు త్రిష రెడీ. ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో విలన్గా చేసి మంచి స్వింగ్ మీదున్నాడు గోపీచంద్. ఇందులో భద్రన్న పాత్రకు అతనే ఫస్ట్ చాయిస్. ఒడ్డూ పొడుగు, క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్తో పోటాపోటీగా ఉండాలి. గోపీచంద్ ఓకే. హీరోయిన్ ఫాదర్గా ప్రకాశ్రాజ్ను మించిన ఆప్షన్ ఎవరుంటారు? డైలాగ్ రైటర్ సత్యమూర్తి కొడుకైన దేవిశ్రీ ప్రసాద్ను ‘దేవి’తో మ్యూజిక్ డెరైక్టర్ని చేసింది ఎమ్మెస్ రాజే. ఆ తర్వాత మళ్లీ పిలవలేదు. ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకోవాలని ముందే ఫిక్స్. గోల్డెన్ చాన్స్. దేవి చెలరేగిపోయాడు. ఎమ్మెస్ రాజు ఒక ట్యూన్ అడిగితే వంద ఆప్షన్లిచ్చేవాడు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంటే ఎమ్మెస్ రాజుకి భక్తి, గౌరవం, ఆరాధన. ఆయనకు స్క్రిప్టు ఇచ్చేసి, ‘‘మీ ఇష్టం గురువుగారూ... ఎంతైనా తీసుకోండి. నాకు మంచి పాటలు కావాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. పగలబడి నవ్వేశారు సిరివెన్నెల. అంతే... పాటల కనక వర్షం కురిసింది. టైటిల్ ‘వర్షం’ అయితే బాగుంటుంది. కానీ వీఎన్ ఆదిత్య అప్పటికే ఇదే టైటిల్తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు. ఎమ్మెస్ రాజు అడగ్గానే టైటిల్ ఇచ్చేశాడు. రూట్ క్లియర్. మార్చి 14... ఎమ్మెస్ రాజు శ్రీమతి పుట్టినరోజు. సెంటిమెంటల్ డే. ‘ఒక్కడు’ అదే రోజు మొదలైంది. ‘వర్షం’ కూడా అదే రోజున స్టార్ట్. ఫస్ట్ షెడ్యూల్ వర్క్ జరుగుతోంది. ఎమ్మెస్ రాజు నాట్ శాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. షూటింగ్ ఆపేశారు. 2 నెలలు బ్రేక్. మళ్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. లోపాలన్నీ పట్టిపట్టి వెతుకుతున్నారు. హీరోకు విలన్కు మధ్య ఒకసారి ఫైట్ జరిగింది. రెండోసారి కూడా ఫైట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ పెట్టకూడదు. అంత ఎఫెక్ట్ వచ్చేంత డైలాగ్ పడాలి. పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాటిల్లో మాస్టర్స్. ‘‘శైలు కోసం నేను వందసార్లు చస్తాను. నువ్వు ఒక్కసారి చస్తావా?’’ అని హీరో, విలన్ని అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్తో విలన్ బుర్ర తిరిగిపోయేలా కొట్టాడు హీరో. ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్. మళ్లీ షూటింగ్ స్టార్ట్. రైల్వేస్టేషన్లో ఓ పాట. అలా ఇలా ఉండకూడదు. మోతెక్కిపోవాలి. ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడతను ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేశాడు. కానీ ఎమ్మెస్ రాజు లాంటివాడు అడిగితే కాదనగలడా? జీ హుజూర్ అంటూ వచ్చేశాడు. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ‘పనపాకం’ రైల్వేస్టేషన్. ప్రభాస్, త్రిష, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, 60-70 మంది మోడల్స్తో వన్ వీక్ తీశారా పాట... ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన... ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’. పూతలపట్టు రైల్వేస్టేషన్... పాత బస్తీలోని సుల్తాన్ బజార్... శంకర్పల్లి దగ్గర భారీ సెట్... ఇలా చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. వరంగల్లో టెన్ డేస్ షెడ్యూల్ చేశారు. ‘‘ఇక్కడ తీసిన సినిమాలేవీ ఆడలేదు’’ అన్నాడు ఒకతను. ‘‘ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ పోతుందిలే’’ చెప్పారు ఎమ్మెస్ రాజు చాలా కాన్ఫిడెంట్గా. ఎమ్మెస్ రాజుకి అరకు వ్యాలీ సెంటిమెంట్. అక్కడ తీసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. అందుకే అరకులో కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ తీశారు. ఇంట్రడక్షన్ షాట్ హెవీ రిస్క్. క్వారీలో బాంబు పేలుళ్ల మధ్య షాట్స్ తీయాలి. డూప్ పెడదామంటే ప్రభాస్ ఒప్పుకోలేదు. 140 వర్కింగ్ డేస్లో సినిమా షూటింగ్ కంప్లీటెడ్. 5 కోట్ల బడ్జెట్ తేలింది. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద రేంజ్కెళ్తాడు. ఇది ఎమ్మెస్ రాజు ప్రిడిక్షన్. ఇంతకు మించి ‘వర్షం’ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదాయన. 2004 సంక్రాంతి. మంచి పోటాపోటీ సీజన్. ఎమ్మెస్ రాజు కాన్ఫిడెన్సే గెలిచింది. వర్షం... సూపర్ డూపర్ హిట్. 120 ప్రింట్స్... 200 థియేటర్స్. సెకండ్ వీక్కొచ్చేసరికి ఇంకో 80 ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఇప్పుడు స్టార్. ‘చిరంజీవి’కి ‘ఖైదీ’లాగా ప్రభాస్కి ఇది టర్నింగ్ పాయింట్. త్రిషకు సూపర్ క్రేజ్. కోలా రంగారావు పాత్రలో ప్రకాశ్రాజ్ డీలింగ్కి ఫుల్ మార్క్స్. భద్రన్నగా గోపీచంద్కు సూపర్బ రెస్పాన్స్. గోపాలరెడ్డి కెమెరావర్క్కు అందరూ ఫ్లాట్. దేవి మ్యూజిక్ క్రియేటెడ్ వండర్. ఎమ్మెస్ రాజుకు డేరింగ్ డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఫిలిం మేకర్గా బ్రాండ్. ఆ రోజు భారీ వర్షం. ఎమ్మెస్ రాజు కారులో వెళ్తూ ఆ వర్షాన్నే మురిపెంగా చూస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా, ఆయన్ని ‘వర్షం’ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. వెరీ ఇంట్రస్టింగ్... * హైదరాబాద్ - తెలుగు లలిత కళాతోరణంలో సిల్వర్జూబ్లీ ఫంక్షన్ చేశారు. చిరంజీవి, వెంకటేశ్, మహేశ్బాబు చీఫ్ గెస్ట్లు. * ఈ సినిమాకు పనిచేసిన వీరు పోట్ల (కథారచయిత), వంశీ పైడిపల్లి - గౌతమ్ పట్నాయక్ - శ్రావణ్ (అసోసియేట్ డెరైక్టర్స్), కె.రాంబాబు (కో-డెరైక్టర్), ప్రభుదేవా - లారెన్స్ - సుచిత్రా చంద్రబోస్ (కొరియో గ్రాఫర్స్), ఎస్.గోపాల్రెడ్డి (కెమెరా మ్యాన్) తర్వాతి కాలంలో డెరైక్టర్స్గా మారారు. ఎమ్మెస్ రాజు కూడా. * తమిళంలో ‘జయం’ రవితో ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘మళై’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ