breaking news
UK Parliament attack
-
బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో...
లండన్: బ్రిటన్ పార్లమెంట్ లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు మృతి చెందారు. కనీసం 40 మంది గాయపడ్డారు. ఉగ్రవాది, పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి చెందారని లండన్ పోలీసులు తెలిపారు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి, పోలీసు అధికారిని పొడిచి చంపిన ఉగ్రవాదిని గుర్తించినట్టు చెప్పారు. అయితే అతడి వివరాలు వెల్లడించబోమని చెప్పారు. చనిపోయిన పోలీసు అధికారి పేరు పీసీ కీత్ పామర్ అని, దాడి సమయంలో ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేదని తెలిపారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆయనను ఉగ్రవాది కత్తితో పొడిచి చంపాడు. మరో అధికారిని పొడవబోతుండగా ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. దుండగుడి వద్ద మూడు కత్తులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్ చుట్టూ ఉన్న వీధులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడిని టెర్రర్ అటాక్ గానే భావిస్తున్నామని లండన్ మెట్రో పాలిటన్ పోలీసు ట్విటర్ పేజీలో ట్వీట్ చేశారు. గాయపడిన వారిలో 15 నుంచి 16 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. 2016, మార్చి 22న బ్రసెల్స్ లో ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో 32 మంది మృతి చెందారు. దాడులకు తెగబడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి: బ్రిటన్ పార్లమెంట్పై టెర్రర్ అటాక్ లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ లండన్ టెర్రర్ అటాక్: భారతీయులు సేఫ్! -
లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బ్రిటన్ పార్లమెంట్ పై తీవ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. లండన్ లో దాడి గురించి తెలియగానే చాలా బాధ పడ్డానని తెలిపారు. బాధితులు, వారి కుటుంబాల తరపున దేవుడి ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్ కు భారత్ బాసటగా నిలుస్తుందని హామీయిచ్చారు. తీవ్రవాదంపై పోరుకు కలిసివస్తామని ట్విటర్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. లండన్ లో ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకంగా కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఉగ్రదాడి బాధితులకు ఆయన నివాళి అర్పించారు. ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావు లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని info.london@hcilondon.in; 020 8629 5950, 020 7632 3035 లను సంప్రదించాలని భారత హైకమిషన్ సూచించింది.