breaking news
Tobacco bales
-
పొగాకు రైతుకు కలిసొచ్చిన వేళ
పొగాకు రైతుకు ఈ ఏడాది కలిసొచ్చింది. మార్కెట్లో మంచి రేటు లభించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ ఏడాది కిలో పొగాకు సరాసరి రూ..178 రాగా గత సంవత్సరం సరాసరి రూ.141లు లభించింది. రైతు ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇదిలా ఉండగా పొగాకు వేలం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో వారంలో వేలం ముగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కందుకూరు/ఒంగోలు సబర్బన్: అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం పరిధిలోని అన్ని వేలం కేంద్రాల్లో అన్ని గ్రేడ్ల పొగాకును వ్యాపారుల పోటీపడి మరీ కొనుగోలు చేయడంతో రైతులు ఆశించిన స్థాయిలోనే ధరలు నమోదయ్యాయి. కందుకూరు వేలం కేంద్రాలు బోర్డు పరిధిలో నంబర్ వన్గా నిలిచింది. బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు ధర సీజన్ మొత్తం రూ.186 వద్ద స్థిరంగా ఉండగా, మొదట్లో రూ.120 పలికిన లోగ్రేడ్ పొగాకు చివరికి వచ్చే సరిసరి రూ.110లుగా పలికింది. దీంతో కేజీ పొగాకు సరాసరి ధర ఇప్పటి వరకు కందుకూరు–1లో రూ.178.38, కందుకూరు–2లో రూ.178.46 వచ్చింది. మిగిలిన అన్ని వేలం కేంద్రాల్లోను రూ.167ల నుంచి రూ.174ల పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన వేలం కేంద్రాలతో పోల్చుకుంటే కందుకూరు వేలం కేంద్రాల్లో సరాసరి ధరలు రూ.4 నుంచి రూ.11 వరకు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది మంచి లాభాలతో పొగాకు సీజన్ను ముగించేందుకు రైతులు సిద్ధమయ్యారు. మిగిలిన పంటలు దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో పొగాకు ఈ ఏడాది రైతులను ఆర్థికంగా నిలబెట్టిందని భావిస్తున్నారు. స్థిరంగా మార్కెట్: ఈ ఏడాది వేలంలో భారీ ఒడిదుడుకులు ఏమీ లేకుండా పొగాకు మార్కెట్ స్థిరంగా కొనసాగింది. పొగాకు ఉత్పత్తి తగ్గి రైతులు ఆశించిన స్థాయిలోనే రేట్లు రావడంతో వేలం ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. దీంతో ఎస్ఎల్ఎస్ పరిధిలో వేలం ప్రక్రియ అటూ ఇటుగా రెండు నెలల వ్యవధిలోనే ముగించగలిగారు. ఎస్ఎల్ఎస్ పరిధిలో 39.47 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు బోర్డు అనుమతి ఉండగా దిగుబడి తగ్గడంతో 33.16 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనికిగాను ఇప్పటికే 32.74 మిలియన్ కేజీల పొగాకు విక్రయాలు పూర్తికాగా ఇంకా 0.78 మిలియన్ కేజీల పొగాకే మిగిలి ఉంది. ఇక కందుకూరు పరిధిలోని వేలం కేంద్రాల్లో మాత్రమే వేలం కొనసాగుతోంది. అత్యధిక పొగాకు ఈ రెండు వేలం కేంద్రాల్లోనే ఉండడంతో వేలం ఆలస్యమవుతోంది. వీటిలో కందుకూరు–1వ వేలం కేంద్రం పరిధిలో 8.03 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉంటే 8.10 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటి వరకు 7.43 మిలియన్ కేజీలను అమ్మగా, ఇంకా 0.67 మిలియన్ కేజీల ఉత్పత్తులు అమ్మాల్సి ఉంది. ఈనెల 16వ తేదీ నాటికి ముగించనున్నారు. కందుకూరు–2లో 6.80 మిలియన్ కేజీలకు అనుమతి ఉంటే 6.70 మిలియన్ కేజీల ఉత్పత్తి వస్తుందని అంచనా. దీనిలో ఇప్పటికే 6.59 మిలియన్ కేజీలను విక్రయించగా ఇంకా 0.11 మిలియన్ కేజీలు అమ్మాల్సి ఉంది. ఈనెల 6వ తేదీ నాటికి వేలం ముగియనుంది. మొత్తం మీద రెండో వారం కల్లా ఎస్ఎల్ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో వేలం ప్రక్రియ పూర్తి కానుంది. చివరి దశలో వేలం.. పొగాకు వేలం పూర్తికావస్తోంది. దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) పరిధిలో మొత్తం 6 వేలం కేంద్రాలుంటే నాలుగు కేంద్రాల్లో ఇప్పటికే పొగాకు వేలాన్ని ముగించారు. పొదిలి, కనిగిరి, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల్లో వేలం ముగియగా కందుకూరు రెండు వేలం కేంద్రాల్లో మరో పది రోజుల్లో వేలం ముగియనుంది. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాల్లో 67.74 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేయగా ఇంకా కేవలం 6.27 మిలియన్ కేజీల ఉత్పత్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిని ఈనెల మూడోవారంకల్లా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. టంగుటూరు పొగాకు వేలం క్రేందంలో శనివారం 681 పొగాకు బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. కారుమంచికి చెందిన రైతులు 718 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 681 కొనుగోలు చేశారు. 35 బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.188 కాగా, కనిష్ట ధర రూ.110, సరాసరి ధర రూ.182.70 పలికింది. వేలంలో మొత్తం 17 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రంలో శనివారం 731 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. అనకర్లపూడి, ముప్పరాజుపాలెం, పెరిదేపి, మిట్టపాలెం, అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, చోడవరం, ముప్పవరం, రామచంద్రాపురం, కట్టావారిపాలెం, నర్సింగోలు గ్రామాల నుంచి రైతులు 930 బేళ్లు వేలానికి తెచ్చారు. 731 బేళ్లు కొనుగోలు చేసి, 179 బేళ్లు తిరస్కరించారు. అత్యధిక ధర కేజీ పొగాకు రూ.187 పలకగా, అత్యల్పం రూ.110, సరాసరి ధర రూ.179.17 వచ్చింది. ఎస్బీఎస్ పరిధిలో... ఎస్బీఎస్ పరిధిలో ప్రకాశం జిల్లా పరిధిలోని వెల్లంపల్లి, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 41.25 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఉండగా 40.50 మిలియన్ కేజీ ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటికే 35.00 మిలియన్ కేజీల ఉత్పత్తుల అమ్మకాలు పూర్తిగా కాగా ఇంకా 5.49 మిలియన్ కేజీల పొగాకును అమ్మాల్సి ఉంది. ఈనెల 20వ తేదీకల్లా పూర్తిగా వేలాన్ని ముగించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పొగాకు సాగే ఈ ఏడాది రైతులను ఆదుకుంది పొగాకు పంట సాగు ఈ సంవత్సరం రైతులకు కలిసొచ్చింది. గతంలో వరుసగా నష్టాలు వచ్చినా ఈ ఏడాది మార్కెట్ బాగుండడంతో మంచి లాభాలు వచ్చాయి. మంచి పొగాకు క్వింటా రూ.18,600ల వరకు వచ్చింది. లోగ్రేడ్ పొగాకు కూడా కాస్త ఆటూ ఇటుగా బ్రైట్ గ్రేడ్తో సమానంగా రేట్లు వచ్చాయి. దీని వల్ల యావరేజ్ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం పొగాకు పంటే రైతులకు కాస్త ఆదాయాలు తెచ్చిపెట్టింది. – అనుమోలు రాములు, పొగాకు రైతు,పోలినేనిపాలెం -
గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్న పొగాకు రైతులు
కొండపి, న్యూస్లైన్: పొగాకు..రైతుల పాలిట పగాకుగా మారింది. ఏటా ఏదో ఒక విధంగా పొగాకు రైతులు నష్టాలు మూటగట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్నారు. కష్టించి పండించిన పంటను ఏదో ఒక రేటుకు వ్యాపారులకు విక్రయించి నిట్టూర్పు విడుస్తున్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి మండలాల్లోని 41 గ్రామాలకు చెందిన రైతులు 2,140 బ్యారన్ల పరిధిలో 9.06 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతివ్వగా 12.9 మిలియన్ కేజీలు పండించారు. ఒక్కో బ్యారన్కు 5 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ప్రకృతి అనుకూలించి గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలో 90 శాతం బ్రైట్ ఎఫ్-1 రకం పొగాకు దిగుబడి వచ్చింది. క్యూరింగ్ చేసుకుని బేళ్లు కట్టుకున్నారు. వేలం ప్రారంభమైంది. కేజీకి 130 ఇస్తే రైతులకు గిట్టుబాటవుతుందని, ఈ రేటు ఇవ్వాలని రైతులు, రైతు నాయకులు బోర్డు అధికారుల సమక్షంలో వ్యాపారులను కోరారు. వేలం ప్రారంభమైన రెండు వారాల పాటు వచ్చిన పొగాకు బేళ్లలో ఎక్కువ శాతం కేజీ 126 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రమేపీ మార్కెట్ పెరుగుతుందని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ రోజులు గడిచేకొద్దీ మార్కెట్ పెరగలేదు సరికదా..మరింత తగ్గిపోతోంది. పది రోజులుగా 90 శాతం పొగాకు బేళ్లను కేజీ 116లకే కొంటున్నారు. వేలం కేంద్రం ప్రారంభించిన 36 రోజుల్లో కేజీకి 10 ధరను దిగకోశారు. మార్కెట్లో పోటీతత్వం లేకపోవడంతో గుత్తాధిపత్యం వహిస్తున్న ఐటీసీ ప్రారంభంలో 65 శాతం పొగాకు కొనుగోలు చేయగా..ప్రస్తుతం తన వాటాను 35 శాతానికి కుదించుకుంది. అదేమని రైతులు అడిగితే పొగాకులో దమ్ములేదని, తెల్లని పొగాకు తాము కొనలేమని ఐటీసీ వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారుల కుట్రే.. గతంలో పండిన పొగాకు రంగు లేదని..రంగు ఉన్న పొగాకును బాగా కొంటామని చెప్పుకుంటూ వచ్చిన వ్యాపారులు ఈ సంవత్సరం పొగాకు పంట మంచి రంగు రావడంతో చివరకు ఏదోక విధంగా వంకపెట్టి తక్కువ ధరకు దక్కించుకునేందుకు కుట్రపన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 కంపెనీలు పొగాకు కొనుగోలుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. అందులో చాలా మంది వ్యాపారులు రోజుకు పట్టుమని పదిబేళ్లు సైతం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అదేమని అడిగే నాథుడే లేడు. వ్యాపారుల మాయాజాలంతో రైతులు ఈ ఏడాది కూడా పగాకు నష్టాలపాలయ్యేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. అటు రైతు ప్రతినిధులు గానీ ప్రభుత్వం గానీ పొగాకు ధరల విషయం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతులు సంఘటితంగా వ్యాపారులను ఎదుర్కొనే శక్తిలేక వారు కొన్న ధరలకే అమ్ముకొని బయటకు వస్తున్నారు. మరో పక్క అప్పులు సైతం రైతులను వేధిస్తున్నాయి. ఇప్పటికైనా పొగాకు బోర్డు స్పందించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరీఘోరం చల్లా మధు, రైతు, నెన్నూరుపాడు మంచి రంగులు వచ్చిన పొగాకును సైతం తక్కువ రేట్లకే వ్యాపారులు కొంటున్నారు. అడిగేవారు లేరు. రాజన్న పాలనలో గిట్టుబాటు ధర దక్కింది. వ్యాపారులు సైతం ప్రభుత్వ ఒత్తిడితో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చైర్మన్ చొరవ తీసుకోవాలి బొడ్డపాటి బ్రహ్మయ్య, చోడవరం, గ్రోయెర్స్ అసోసియేషన్ మెంబర్ బోర్డు చైర్మన్ చొరవ తీసుకుని వ్యాపారుల చేత ఇండెంట్ ప్రకారం కొనుగోలు చేయించాలి. చాలా మంది వ్యాపారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప పొగాకు కొనుగోలు చేయడం లేదు. దీని వలన వ్యాపారుల్లో పోటీతత్వం తగ్గిపోయి రైతు నష్టపోతున్నాడు. ఎక్కువ బేళ్లు నోబిడ్లు చేస్తున్నారు మేకల శేషారెడ్డి, రైతు, గుర్రపడియ తెచ్చిన పొగాకు బేళ్లలో సగం నోబిడ్లే అవుతున్నాయి. అదేమంటే పొగాాకు తెల్లగా ఉందని మరోసారి బేళ్లు తిరగకట్టుకుని తెచ్చుకోమంటున్నారు. ఒకసారి వెనక్కు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తే బేలుకు 10 కేజీల పొగాకు కాటా తగ్గిపోతుంది. చెక్కుకు *1200 నష్టం వస్తుంది. వ్యాపారులు దగా చేస్తున్నారు యం మాలకొండారెడ్డి, రైతు, గుర్రపడియ వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దగా చేస్తున్నారు. మార్కెట్ను పెరగనీయకుండా చేసి తక్కువ ధరలకే పొగాకు కొనుగోలు చేస్తున్నారు. బోర్డు అధికారులు సైతం మిన్నకుండి పోతున్నారు. రంగు పొగాకు కావాలన్న వ్యాపారులుకు కుంటిసాకు దొరక్క తెల్లగా ఉందని నాటకాలు ఆడుతున్నారు.