breaking news
Three regions
-
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి
పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాలను పరిశీలించిన పౌరహక్కుల సంఘం కమిటీ జూపాడుబంగ్లా, న్యూస్లైన్: రాష్ట్ర విభజన అనివార్యమైతే నీటి పంపిణీ విషయంలో మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని రాష్ట్ర పౌరహక్కుల సంఘం కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య డిమాండ్ చేశారు. శనివారం పౌర హక్కుల సంఘం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన సభ్యులు కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ నీటి వనరుల పంపిణీలో కరువు ప్రాంతాలకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ సముద్రం పాలవుతున్న మిగులు జలాల సద్వినియోగంపై దృష్టి సారించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టుతో నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ముంపునకు గురిచేసి కోస్తాంధ్రకు నీటిని తరలించడం భావ్యం కాదన్నారు. స్వాతంత్య్రం రాకముందు ప్రారంభించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తి చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వ్యయం ఎక్కువే అయినా.. ప్రయోజనం తక్కువగా ఉందన్నారు. పౌరహ క్కుల సంఘం సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఏటా సముద్రం పాలవుతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతో 273 కుటుంబాలకు చెందిన 3 ల క్షల మంది నిరాశ్రయులవుతుండగా.. వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకనే నిర్మాణానికి పూనుకోవడం సమంజసం కాదన్నారు. రాయలసీమ జేఏసీ కన్వీనర్ సోమశేఖరశర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే ప్రత్యేక రాయలసీమతోపాటు శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం ఈ ప్రాంతానికి నీటి వనరులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరహక్కుల సంఘం సభ్యులు డాక్టరు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజినీర్ సుబ్బరాయుడు, ఖరీం భాష, అల్లాబకాష్, బీసీ రాష ్టస్రంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
'విభజనతో మూడు ప్రాంతాలకు నష్టం'
కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తుందని సీమాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ కిషోర్ బుధవారం న్యూఢిల్లీలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విభజన వల్ల ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జంతర్మంతర్ వద్ద న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఆయన తన సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ప్రాంతంలో విద్యార్థి జేఏసీ క్రియాశీలకంగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇటీవలే ఆ విద్యార్థి జేఏసీ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి విజ్ఞప్తి చేస్తున్న విషయం విదితమే.