breaking news
Surveillance teams
-
పోలీసుల ఎన్నికల అ‘‘టెన్షన్’’!
సాక్షి, కర్నూలు: ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు పలువురు కొత్త పోలీసు అధికారులు వచ్చారు. ఎస్పీ మొదలుకొని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల వరకు అంతా కొత్తవారే. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాజకీయ పార్టీలు జిల్లాలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 11 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. అదే స్థాయిలో పట్టును నిలుపుకోవాలని వైఎస్సార్సీపీ, గతం కంటే ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలని అధికార టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ‘భద్రత’పై ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్త వహిస్తూ పల్లెల వారీగా పట్టు బిగించే దిశగా ఇరు పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. పల్లెల్లో కార్యకర్తలను పెంచుకోవడం నుంచి నేతలను బలోపేతం చేయడం వరకు ఇరు పార్టీల్లో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అనేక పల్లెలు అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో కొన్నేళ్లుగా నిరవధికంగా పోలీసు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి చోట ఇప్పుడు భద్రత కట్టుదిట్టం చేయాల్సి వస్తోంది. ఫ్యాక్షన్ గ్రామాల్లో సవాలుగా మారినశాంతిభద్రతలు... జిల్లాలోని ఫ్యాక్షన్ మూలాలు ఉన్న గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖకు సవాలుగా మారింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక సాధారణ గ్రామాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ తలమునకలైంది. ఈసారి ‘క్రిటికల్ విలేజ్’ పేరుతో తగాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తోంది. ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల పేరును ఈ ఎన్నికల్లో క్రిటికల్ విలేజ్గా మార్చారు. ఏయే ప్రాంతాల్లో అధికంగా తగాదాలు జరుగుతాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 71 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం జిల్లాలోని 28 గ్రామాల్లోని 71 పోలింగ్ కేంద్రాలను ఇప్పటివరకు పోలీసు శాఖ అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 740 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అందుకు అవసరమైన బందోబస్తు ప్రణాళికలను సిద్ధం చేశారు. సుమారు 20 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు కేటాయించాలని ఎన్నికల కమిషన్కు నివేదించారు. జిల్లాకు చెందిన సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బలగాలతో కలిపి సుమారు 12 వేల మందితో బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. నగదు, కానుకల తరలింపు, అక్రమ మద్యం రవాణాపై నిఘా కోసం జిల్లా వ్యాప్తంగా 42 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. -
ఇదీ హద్దు...దాటవద్దు!
► అభ్యర్థులూ... ఇవి మరువద్దు ► నిఘా ముమ్మరం చేసిన సర్వైలెన్స్ టీమ్స్ ► ఏమాత్రం ‘కట్టు తప్పినా’ తిప్పలు తప్పవు సిటీబ్యూరో: ‘గ్రేటర్’లో వచ్చే నెల 2న జరుగనున్న ‘ఫైట్’కు ప్రచా రం ఊపందుకుంది. ఈ హడావుడి... ‘సీటు’ కోసం పడే పాట్లలో పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించకూడదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ ఉండ దు. ఎన్నికల ఘట్టాన్ని సజావుగా పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వీటి అమలుకు పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, కార్యక ర్తలు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే. అలా చేయ ని వారిని గుర్తించ డానికే పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన సర్వైలెన్స్ టీమ్స్, స్వ్కాడ్స్ డేగ కన్ను వేశాయి. ఏమాత్రం ఉల్లంఘన కనిపించినా...భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో పోలీసులు సూచిస్తున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలోనైనా సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు తదితర కార్యక్రమాలు నిర్వహించాలంటే నిర్ణీత సమయం ముందు స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, రోడ్షోల కు అనుమతి పొందే సమయంలో అవి ప్రారంభమయ్యే ప్రాంతం, సమయం, ప్రయాణించే మార్గం, సమయం, సాగే దారి వివరాలు స్పష్టం గా తెలియజేయాలి. దీనికిఅనుగుణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. ప్రదర్శనసమయంలో ట్రాఫిక్కు ఏమాత్రం అంతరా యం కలగకుండా రోడ్డుకు ఓ పక్కగా మాత్రమే వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు కలిగిస్తే.. కార్యక్రమానికి అనుమతి తీసుకున్న వ్యక్తే బాధ్యత వహించాలి.ఎన్నికల నియమావళి ప్రకారం కాన్వాయ్లో అత్యధికంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది ద్విచక్ర వాహనమైనా... భారీ వాహనమైనా ఒకేలా పరిగణిస్తారు. కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని వెళ్లినా దాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. నామినేషన్లు, ప్రచార సమయంలో బల ప్రదర్శన కోసం జన సమీకరణ చేసినా... వారికి ధనం, మద్యం పంపిణీ చేసినా చర్యలు తప్పవు. ప్రచారానికి వినియోగించే లౌడ్ స్పీకర్లు, మైకులకు స్థానిక పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఏ వాహనాన్ని ప్రచారానికి వినియోగించదలిచారో ఆ నెంబరు కచ్చితంగా చెప్పాలి. వాహనాల్లో అక్రమంగా ఆయుధాలు, విస్ఫోటన పదార్థాలు, కరెన్సీ, మద్యం సరఫరా చేస్తుంటే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహన చోదకుడు, యజమానిని అరెస్టు చేస్తారు. ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయకూడదు. మిగిలిన ప్రదేశాల్లోనూ ఇతరులకు ఇబ్బంది కలిగించని స్థాయిలోనే మైకుల వినియోగానికిఅనుమతిస్తారు. సెక్షన్లు... నేరాలు... ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 171 ప్రకారం... ► సెక్షన్ 171బి- ఓటర్లకు నగదుతో ప్రలోభ పెట్టడం. ► సెక్షన్ 171సి-ఓటర్లను వివిధ రకాలుగా ప్రభావితం చేయడం. సెక్షన్ 171డి-దొంగ ఓట్లు వేయడం. ► సెక్షన్ 171ఐ-ఎన్నికల వ్యయ నివేదికలను సకాలంలో అధికారులకు సమర్పించకపోవడం. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలివీ... ► సెక్షన్ 123- ఓటర్లకు లంచం ఇవ్వజూపడం, ప్రలోభాలకు లోను చేయడం, కుల, మత, వర్గ, భాషాపరమైన, మతపరమైన జెండాలను చూపించి ఓట్లు అడగటం. ► సెక్షన్ 125- ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు పెంచడం. ► సెక్షన్ 126- నిషేధిత సమయాల్లో బహిరంగ సభలు నిర్వహించడం. ► సెక్షన్ 127- ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించడం. ► సెక్షన్ 127(ఎ)- పోస్టర్లు, కరపత్రాల ముద్రణ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించకపోవడం. ► సెక్షన్ 128- రహస్య ఓటింగ్ హక్కుకు భంగం కలిగించడం. ► సెక్షన్ 130- పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధిత ప్రాంతంలో ప్రచారం చేయడం. ► సెక్షన్ 131- పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలను ఉల్లంఘించడం. ► సెక్షన్ 132- పోలింగ్ కేంద్రాల వద్ద అనైతికంగా ప్రవర్తించడం. ► సెక్షన్ 133- ఎన్నికల ప్రక్రియలో అక్రమంగా వాహనాలను వినియోగించడం. ► సెక్షన్ 134(బి)- పోలింగ్ కేంద్రం చుట్టూ అక్రమంగా సంచరించడం. ► సెక్షన్ 135(ఎ)- పోలింగ్ బూత్ల ఆక్రమణ, రిగ్గింగ్. ► సెక్షన్ 136- ఎన్నికల సిబ్బందికి సంబంధించిన అధికారిక, పోలింగ్ సాధనాలను ధ్వంసం చేయడం. -
చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి
♦ కర్నూలులో నిందితురాలు ♦ పోలీసుల మోహరింపు చిలకలగూడ/చిన్నశంకరంపేట : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ పోలీసులు కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లి అగ్రహారానికి చెందిన రాములు, రేణుకల కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రం.. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్కేసర్కు చెందిన రవికుమార్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, అక్కడకు వెళ్లారు. నిందితురాలిని రాత్రికి లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్వర్గాలు స్పష్టం చేశాయి. అడ్డంకిగా మారిన ఆదివారం... చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్లు.. నిందితురాలి సెల్నంబర్ సమాచారాన్ని అందించలేకపోయారని తెలిసింది.