breaking news
to support the price
-
ధాన్యం కొనుగోలుకు ని‘బంధనాలు’
తోటపల్లిగూడూరు: అన్నదాతకు కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల పేరుతో ప్రభుత్వం బిగించిన నిబంధనాల ఉచ్చులో రైతన్నలు విలవిల లాడిపోతున్నారు. విసిగిపోయిన అన్నదాతలు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధరకే దళారులకు అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం జిల్లాలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అధికారులు ప్రస్తుతానికి 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలంటూ అధికారులు జిల్లా రైతాంగానికి ఉచిత సలహాలు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,400, పుట్టి(850కేజీలు)కి రూ.11,900, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్కురూ.1,360, పుట్టికి రూ.11,560గా ప్రభుత్వం మద్దతుధర ప్రకటించింది. ఈ మద్దతు ధరను పొందాలంటే ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలంటూ అధికారులు పెట్టిన నిబంధనలు రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉండాలని, దుమ్ము, ధూళి, మట్టి, రాళ్లు, చెత్త, తాలు 1 శాతానికి మించకూడదని, దెబ్బతిన్న, రంగుమారిన, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగులు పట్టిన ధాన్యం 5 శాతంలోపు ఉండాలని షరతులు విధించారు. అలాగే పరిపక్వానికి రాని, కుచించుకుపోయిన, వంకరపోయిన ధాన్యం 3 శాతానికి మించరాదని, కల్తీ, కేళి ఇతర తక్కువ రకాల ధాన్యం 6 శాతంలోపు ఉండాలని నిబంధన. సాధారణంగా శాంపిల్స్ ప్రక్రియలో ఆయా ప్రమాణాల్లో తేడా ఉంటే ఆ మేరకు ధర తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ప్రమాణాలు పాటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు. ఇలా నిబంధనల చట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పోల్చుకుంటే దళారులకు అమ్మడం మేలనీ రైతులు భావిస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో దళారుల చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం దళారులు పుట్టికి రూ.10,500కు మించి కొనుగోలు చేయడం లేదు. 15 రోజుల్లో 834 పుట్లే కొనుగోలు! ప్రస్తుత సీజన్ రబీలో జిల్లావ్యాప్తంగా 10 నుంచి 12 లక్షల పుట్ల ధాన్యం వస్తుందని ఓ అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 150 కొనుగోలుకేంద్రాల ద్వారా 1,21,990 మెట్రిక్ టన్నుల(1,43,528 పుట్లు) ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభమైన పదిహేనురోజుల్లో రెండు లక్షల పుట్లకుపైగా బయటకు వచ్చింది. కాగా ఇప్పటివరకు 109 కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ప్రస్తుతానికి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యం 834 పుట్లు(709 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిల్లర్ల ద్వారా మరో 12,523 మెట్రిక్ టన్నుల(14,732 పుట్లు)ను కొనుగోలు చేశారు. ప్రారంభించిన 109 కొనుగోలు కేంద్రాల్లో 90 శాతం కేంద్రాల్లో ఇప్పటికీ గింజ కూడా చేరని పరిస్థితి. బయటకు వచ్చిన రెండ లక్షల పుట్లలో అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా 834 పుట్లను కొనుగోలు చేశారంటే ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారులు లేనిపోని సాకులు చూపుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని స్థానిక రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. అడ్డమైన నిబంధనలు రైతు మెడకు చుట్టిన ప్రభుత్వం పునరాలోచించి వాటిని సడలిస్తేనే కొనుగోలు కేంద్రాలు ధాన్యపురాసులతో కళకళలాడుతాయి. -
అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తాం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కేఈ నందికొట్కూరు: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తంగడంచ ఫారం భూములల్లో ఫ్యాక్టరీలు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యుత్ ఇబ్బందులు అధిగమించేందుకు జిల్లాకు సౌర వెలుగులు తీసుకొస్తామని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. తుగ్లలక్ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తుతే దౌర్జన్యంగా కృష్ణా జలాలను వాడుకోవాలని చూస్తున్నారన్నారు. రాయలసీమ రైతులంటే నలమల్ల పులి బిడ్డలని ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. తోపులాట.. ప్రజా సంఘాలు పెద్ద ఎతున్న తరలివచ్చి కేఈ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన సీఎం డౌన్, డౌన్ అంటు ప్రజా, విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. దీంతో పోలీసుల మధ్య, ప్రజా సంఘాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఉప ముఖ్యమంత్రికి ప్రజా, విద్యార్థి సంఘాలు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, కలెక్టర్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ గౌడు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పీపీ నాగిరెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ నరసింహులు, మార్కెట్ యార్డు సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.