breaking news
sudapalem
-
చంద్రబాబుకు బాధ్యత లేదా?
≈ సీఎంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు ≈ దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే తీరిక లేదా? ≈ మొక్కుబడిగా రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందా? ≈ ఒక్కొక్కరికి రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే ≈ బాధితుల గోడు వింటే గుండె బరువెక్కుతోంది ≈ దళితులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ≈ అమలాపురం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రతిపక్ష నేత సాక్షిప్రతినిధి, కాకినాడ: పాశవిక దాడిలో గాయపడ్డ దళితులను పరామర్శించే సమ యం, తీరిక, బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేవా? అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. గోదావరి అంత్య పుష్కరాల ముగింపు ఉత్సవాలకు రాజమహేంద్రవరానికి వచ్చి కూడా బాధితులను కనీసం పలకరించాలనే మానవతా దృక్పథం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. దళితులను పట్టించుకోకుండా వెళ్లిపోయిన చంద్రబాబును ఏమనుకోవాలని ప్ర శ్నించారు. బాధితులకు ఏదో మొక్కుబడిగా తలో రూ.లక్ష ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటున్నారా? అని ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుచుకుంటున్న దళితులపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అమలాపురం ఏరి యా ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. మీడియాతో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నిన్న చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చారు. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి, ఏం జరిగిందో అడిగి ఉంటే.. వారిలో మనోధైర్యం పెరిగేది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబితే బాధితుల్లో నమ్మకం కలిగేది. ఆ నమ్మకం ఈవాళ చంద్రబాబు ఇవ్వగలుగుతున్నారా? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టం ప్రకారం.. ఇలాంట దారుణమైన ఘటనలు జరిగితే ప్రభుత్వం తరుపున బాధితులకు రూ.లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి మాత్రం అందులో మొదటి చెప్పిన రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో చంద్రబాబే చెప్పాలి. చట్టంలో ఉన్నట్టుగా నలుగురు బాధితులకు రూ.8.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దళితులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలి. ప్రజలకు తోడుగా ఉంటామనే భరోసాను కల్పించాలి. హోం మంత్రి సొంత మండలంలో ఘోరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పిన విషయాలు వింటే గుండె బరువెక్కుతోంది. వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా? వారు దశాబ్దాలుగా చర్మాలు వలుచుకునే వృత్తిలో ఉన్నారు. బతుకు తెరువు కోసం వారికి మరో మార్గం లేదు. ఆవు చర్మం తీస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో వీరిని శ్మశానం నుంచి దాదాపుగా 300 మీటర్లు చొక్కా పట్టుకొని నిర్దాక్షిణ్యంగా లాక్కొని పోయారు. శ్మశానం నుంచి బయటకు వచ్చిన తరువాత చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దుర్భాషలాడుతూ చెప్పు తీసుకుని మరీ కొట్టారు. చిన్న పిల్లవాడిని కూడా వదిలిపెట్టలేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. వ్యక్తులను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, చెట్లకు కట్టేసి చెప్పులతో కొట్టడమన్నది సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు. అరగంట తరువాత పోలీసులు వచ్చారు. పోలీసుల సమక్షంలోనే తమను తీవ్రంగా కొట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్లని కాపాడేందు కోసం వారి పిల్లలు కూడా వచ్చారట. పిల్లలను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ కొట్టారు. రాష్ట్ర హోం మంత్రి సొంత మండలంలో ఇది జరగడం అత్యంత హేయం. ఏం జరిగిందో తెలుసుకోవాలని దళిత సంఘాలు వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే బాధితులను ఆస్పత్రిలో చేర్చారు. పోలీసు స్టేషన్లో వ్యాను డ్రైవర్ లక్ష్మీప్రసాద్ను లెంపకాయలు కొట్టారు. నిజంగా పేదవాళ్లంటే ఇంత అలుసా? చట్టాలన్నీ ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఇక ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది? తోటి మనిషిని మనిషిగా చూడాలి మన వ్యవస్థలో మార్పు వచ్చే దిశగా అడుగులు వేయాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే మనం ముందుండి గట్టిగా అడగాలి. తోటి మనిషిని మనిషిగా చూడాలి. ఇది కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. మొన్న విశాఖ జిల్లా ఫాల్మన్పేటలో మత్స్యకారులకు ఇదేరమైన అన్యాయం జరిగింది. అక్కడ యనమల రామకృష్ణుడు అనే మంత్రిస్థానంలో ఉన్న వ్యక్తి తన తమ్ముడిని, మనుషులను పంపించి బీభత్సం సృష్టించాడు. మేమంతా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలిచాం. వారికి భరోసా ఇచ్చాం. ఇక్కడ కూడా దళితులకు అన్యాయం జరిగిందని వచ్చాను. తప్పు చేశారని భావిస్తే పోలీసు స్టేషన్కు వెళ్లి కేసులు పెట్టాలి. అంతేకానీ ఎవరికి వారు నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టకూడదు. ఇలా కొట్టేవారిని కఠినంగా శిక్షస్తేనే సమాజానికి సందేశం వెళ్తుంది’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు. -
21వ శతాబ్ధంలో కూడా ఇలాంటి ఘోరమా?
-
21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘోరమా?: వైఎస్ జగన్
అమలాపురం: దళితులపై దాడి అమానుషమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధకు పాల్పడ్డారన్న అపోహతో ఇటీవల దళితులపై దుండగులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడిలో గాయపడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్పత్రిలో పేషెంట్లుగా ఉన్న దళితులను ఏం జరిగింది, ఎందుకు జరిగిందని అడిగితే వీళ్ల చెప్పిన విషాయాలు వింటే గుండె బరువెక్కుతుంది. ఇది ధర్మమేనా.. వ్యవస్థలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రశ్నించకపోవడం ధర్మమేనా?. ఏం జరిగిందని అడిగినప్పుడు వాళ్లు చెప్పింది వింటే బాధ అనిపిస్తుంది. అరవింద్ అనే సామిల్ ఓనర్ తన ఆవు చనిపోతే, ఆ ఆవును తీసుకెళ్లాలని ఇక్కడున్న ఎలిషా, వెంకటేశ్వరరావులను కోరారు. వీళ్లు జంతు చర్మం మీదే ఆధారపడి బతుకుతారు. వాళ్ల వృత్తే అది. అరవింద్ ఫోన్ చేసిన తర్వాత వాళ్లు ఆ ఆవును వ్యాన్లో శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి, చర్మాన్ని ఒలిచి ఆవును పూడ్చిపెడుతున్నారు. అది వాళ్ల వృత్తి.. అది తప్ప వేరే ఆదాయమార్గం లేదు. దశాబ్దాలుగా అదే పని చేసుకుంటున్నారు. ముందుగా అక్కడకు ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి నెంబరు నోట్ చేసుకున్నారు. వెంటనే పది - పదిహేను నిమిషాల్లో దాదాపు 15 మంది పైచిలుకు అక్కడకు వచ్చారు. వచ్చీ రాగానే వీళ్లను నిర్దాక్షిణ్యంగా శ్మశానం నుంచి లాక్కుని బయటకు వచ్చి నడిరోడ్డు మీద చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. దుర్భాషలాడుతూ, చెప్పు తీసుకుని మొహాన కొట్టారు. దెబ్బలు తిన్నవాళ్లలో పదోతరగతి పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ సంగతి కూడా పక్కన పెట్టి పసివాడిని కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం.. వాళ్లు చేసింది తప్పని అనిపిస్తే పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కేసులు పెట్టాలి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఆ నలుగురినీ కట్టేసి నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం సభ్య సమాజం ఆమోదించాల్సిన విషయమేనా. పోలీసుల సమక్షంలోనే ఇంకా ఎక్కువ కొట్టారు. వీళ్లను కాపాడేందుకు పిల్లలు వస్తే వాళ్లను నడిరోడ్డు మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. వాళ్ల ముందు మళ్లీ కొట్టారు.అర్ధగంట తర్వాత పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. వీళ్లు చెప్పే మాటలను కూడా పోలీసులు వినే పరిస్థితి లేదు. ఈ ఆవు యజమాని స్వయంగా చెబితేనే వెళ్లి ఆవు మృతదేహాన్ని తీసుకెళ్లినట్లు చెప్పినా, ఆ సామిల్లు ఓనర్తో మాట్లాడండని చెప్పినా కనీసం పోలీసులు ఆ మాటలు కూడా వినిపించుకోలేదు. పైపెచ్చు నడిరోడ్డు మీద చెప్పులతో కొట్టడం, హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. ఆయన సొంత ఊరు అయినా కూడా ఇక్కడే ఈ ఘటన జరగడం బాధాకరం. మర్నాడు ఆ అరవింద్ దగ్గరకు పోవాలని దళిత సంఘాలు గొడవ చేస్తే అప్పుడు వీళ్లను తీసుకెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు. బాధితులకు రు.లక్ష పరిహారం ఇవ్వడం అన్యాయం. నిబంధనల ప్రకారం రూ.8 లక్షల 20వేలు చెల్లించాలి. రాజమండ్రి వరకూ వచ్చిన సీఎం చంద్రబాబు అమలాపురం వచ్చి ఉంటే బాధితుల్లో నైతిక స్థైర్యం పెరిగేది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
సుదాపాలెం ఘటనను ఖండించిన చంద్రబాబు
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాలకు తాము రక్షణగా ఉంటామని ఆయన గురువారమిక్కడ హామీ ఇచ్చారు. రాజకీయంగా చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను చేతిలోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ముగ్గురికి మూడు లక్షలు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు. రెండ్రోజుల్లోనే ఎనిమిదిమంది నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ఆవులను అపహరించి వధిస్తున్నారన్న అనుమానంతో కొందరు దళితులపై దాడికి దిగారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమలాపురంలోని జానకిపేటకు చెందిన మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, లాజర్ ఈ ఘటనలో గాయపడిన విషయం తెలిసిందే.