రెడ్లైట్ ప్రాంతాలు అవసరమనే శివప్పు ఎనక్కు పుడిక్కుం
ముంబై లాంటి నగరాల్లో వేశ్యలకంటూ రెడ్లైట్ ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. చెన్నైలాంటి మహా నగరాల్లోనూ అలాంటి ప్రాంతాలు అవసరం అని చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు యురేకా తెలిపారు. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇంతకు ముందు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన జే.సతీష్కుమార్ నిర్మించిన తాజా చిత్రం శివప్పు ఎనక్కు పుడిక్కుం. దర్శకుడు యురేకా ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి శాండ్రా ఎమీ, బజార్బాబు, రోజామలర్, కామాక్షి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర వివరాలను తెలుపుతూ చెన్నై లాంటి మహా నగరాల్లో పలు రాష్ట్రాలకు చెందిన వారు, ఇతర దేశాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇలా నానాటికీ జనాభా పెరుగుతున్నట్లుగానే పడుపు వృత్తి అధికం అవుతుందన్నారు. దీంతో అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అలాంటి అత్యాచారాలకు వ్యతిరేకమే తమ చిత్రం అని తెలిపారు. ఒక వేశ్య తన వద్దకు వచ్చే ఐదుగురి మనçస్తత్వాల గురించి ఒక రచయితకు వివరించే ఇతివృత్తమే ఈ చిత్రం అని తెలిపారు. అదే విధంగా వివాదాస్పద అంశం అయిన రెడ్లైట్ ప్రాంతాలు అవసరం అనే చెప్పే చిత్రంగా శివప్పు ఎనక్కు పుడిక్కుం ఉంటుందన్నారు. అయితే చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవని తెలిపారు. సెన్సార్ సభ్యులు, విమర్శకులు, పత్రికల వారు ప్రశంసించిన చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు.