breaking news
sealing Lands
-
రాజుకుంటున్న భూ వివాదం
♦ సీలింగ్ భూములు తిరిగి లాక్కుంటున్నారు.. ♦ దివానం వారసులపై గిరిజనుల ఆరోపణ అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని నారంవారిగూడెం స్టేజీ వద్ద ప్రభుత్వం కొందరు గిరిజనులకు పట్టాలిచ్చిన భూమిని సీలింగ్లో కోల్పోయిన జమీన్ వారసులు కబ్జా చేశారని, తిరిగి గిరిజనులకు అప్పగించడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం వివాదాస్పద భూమి వద్ద పట్టాలున్న గిరిజనులు విలేకరులకు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే... 1998లో నారంవారిగూడెం వద్ద 43 ఎకరాల దివానం భూమి సీలింగ్లో ప్రభుత్వం తీసుకుని అదే గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులకు పట్టాలిచ్చారు. ఒక్కో గిరిజన రైతుకు అర ఎకరం నుంచి 6 ఎకరాల వరకు వేర్వేరుగా పట్టాలిచ్చారు. పట్టాదారు పాస్బుక్లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం పట్టాలయితే ఇచ్చింది కానీ భూమిని తిరిగి దివానం వారసులు డీకే మహిపాల్, మాజీ జెడ్పీటీసీ జూపల్లి కోదండ వెంకటరమణారావు వ్యవసాయం చేసుకుంటున్నారని చెబుతున్నారు. రూ.2 వేలు కౌలు ఇస్తున్నాం.. ఎకరాకు ఏడాదికి రూ.2 వేలు మాత్రమే కౌలుగా చెల్లిస్తున్నాం. ఐదేళ్లుగా కౌలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేయనివ్వకుండా అడ్డుకున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి భూమిని దున్నుతుండగా అడ్డుకోవడంతో తమపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని, దీంతో అసలు విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. బాధితులు వీరే.. 1998లో జారీ చేసిన పట్టాల ప్రకారం నారంవారిగూడెం రెవెన్యూ గ్రామంలోని 1/70 యాక్టు పరిధిలోని సర్వే నంబరు 453లో కిన్నెర సీతమ్మకు అర ఎకరం, మనుగొండ ముత్యాలుకు అర ఎకరం, మనుగొండ బుచ్చమ్మకు 5 ఎకరాలు 3 కుంటలు, నల్లగుండ్ల లక్ష్మికి అర ఎకరం, నల్లగుండ్ల కృష్ణవేణికి అర ఎకరం, ఎదిరాజు వెంకమ్మకు ఎరకం మనుగొండ దుర్గయ్యకు 6 ఎకరాలు, సర్వే నంబరు 385లో గుళ్ల అనంతకు అర ఎకరం, నల్లగుండ్ల మహాలక్ష్మికి అర ఎకరం, మనుగొండ నరసమ్మకు 1.2 ఎకరాలు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఏళ్లు తరబడి పట్టాదారు పాస్పుస్తకాలు మాకు అందకుండా అధికారులను మేనేజ్ చేశారని, తహసీల్దార్ కార్యాలయంలో వెతికి మా పాస్ పుస్తకాలు మేం సంపాదించుకున్నామన్నారు. తమకు జరిగిన అన్యాయానికి అధికారులకు చెప్పుకుందామని వెళ్లినా రాజకీయ ప్రాబల్యంతో మా గోడు వినట్లేదని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భూములు అప్పగించాలని కోరుతున్నారు. భూముల జోలికి పోలేదు: డీకే మహిపాల్ నారంవారిగూడెంలో మా తాతల కాలం నుంచి మా కుటుంబ అనుభవంలో ఉన్న భూములను సీలింగ్లో ప్రభుత్వానికి అప్పగించిన మాట వాస్తవమే. కానీ సర్వే నంబరు 453లో మాకు సెంటు భూమి మిగలకుండా వదిలేశాం. ప్రస్తుతం నా పేర ఉన్న పట్టా సర్వే నంబరు 353 లోనిది. వాటర్ ట్యాంకు నిర్మించిన స్థలం పొలంలోనిదే. ఆరోపణల్లో వాస్తవం లేదు. విచారణ నిర్వహిస్తాం: యలవర్తి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సీలింగ్ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణ మా దృష్టికి వచ్చింది. వీఆర్వో, ఆర్ఐలను భూమి వద్ద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తాను. ఎవరికీ అన్యాయం జరుగకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. -
అభివృద్ధిలో అసమానతలు తొలగిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తానని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతానని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో కలెక్టర్గా పనిచేసిన అనుభవం రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఏఎస్ కెరీర్లో ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలెక్టర్ పోస్టుతోనే సాధ్యమని, మరోసారి ప్రభుత్వం ఈ అవకాశం ఇవ్వడం తన అదృష్టమని అన్నారు. కలెక్టర్ చెప్పిన మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. విలువైన అసైన్డ్, సీలింగ్ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తాం. శివార్లలోని భూములపై నిఘాను ముమ్మరం చేయడమేగాకుండా... ల్యాండ్ బ్యాంక్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భూములు కాపాడుకోవడం అనివార్యం. తెలంగాణలో కీలకమైన పెట్టుబడులకు అనువైన ప్రాంతం రంగారెడ్డి జిల్లా. ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇతర పరిశ్రమల స్థాపనకు అనువైన కేంద్రంగా జిల్లాను మలచాల్సిన అవసరముంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తాం. అసమానతలకు ఫుల్స్టాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో మిళితమైన జిల్లాలో అభివృద్ధిలో భారీ వ్యత్యాసం ఉంది. అభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతాన్ని శివార్లకు దీటుగా తయారుచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తాం. ఉద్యాన తోటల పెంపకం, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ ద్వారా వికారాబాద్, తాండూరు ప్రాంతాలను ప్రగతిపథంలో పయనింపజేస్తాం. హార్టికల్చర్, డెయిరీ విస్తృతి ద్వారా రైతాంగాన్ని ప్రోత్సహిస్తాం. విద్యాప్రమాణాలు మెరుగుపరుస్తా సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించాల్సిందే. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించేందుకు సమష్టిగా కృషి చేస్తాం. మూడు వారాల్లో జిల్లాల్లో సమస్యలపై అధ్యయనం చేస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నిస్తాం.