breaking news
SAARC countries
-
అత్యవసర నిధి ఏర్పాటు చేద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై యుద్ధానికి సార్క్ దేశాలు నడుం బిగించాయి. కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సార్క్ దేశాల నేతలు ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్లో పాల్గొన్నారు. కరోనాపై పోరుకు ‘కోవిడ్–19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపారు. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు. ‘మనం ముందు కోవిడ్–19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నా. మొదట, భారత్ తరఫున కోటి డాలర్లను ఆ ఫండ్ కోసం ప్రకటిస్తున్నా. ఇతర సభ్య దేశాలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలి’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. వైద్య నిపుణులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఇతర వైద్య పరికరాలను, నిర్ధారణ పరీక్షలు జరిపే కిట్స్ను సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైతే, సార్క్ సభ్య దేశాలకు కూడా వాటిని సమకూర్చగలమన్నారు. వైరస్ వ్యాప్తిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ను రూపొందించామన్నారు. ఆ సాఫ్ట్వేర్ను కూడా సార్క్ దేశాలకు ఇస్తామన్నారు. ‘మన దేశాల్లో మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెచ్చరించారు. వేరువేరుగా కాకుండా, ఒక్కటిగా కరోనా వైరస్పై పోరు సాగించాలని సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భయాందోళనలకు గురికాకుండా, వైరస్ను అడ్డుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. వీడియో కాన్ఫెరెన్స్లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, పాక్ ప్రధానికి ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారు జాఫర్ మీర్జా పాల్గొన్నారు. కరోనా నిర్మూలన లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలోనూ పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్లో నిర్బంధాలను తొలగించాలని కోరింది. వైరస్ను అరికట్టడంలో చైనా గొప్పగా వ్యవహరించిందని పాక్ ప్రశంసించింది. వైరస్పై పోరును సమన్వయం చేసేందుకు సార్క్ దేశాలు ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజపక్స సూచించారు. ప్రధాని మోదీ సూచనలను, వైరస్ కట్టడికి భారత్ చేపట్టిన చర్యలను సభ్య దేశాల నేతలు ప్రశంసించారు. -
మోదీ సుడిగాలి పర్యటన!
మరో అయిదు రోజుల్లో తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మిగిలిన రంగాల మాటెలా ఉన్నా దౌత్య రంగంలో మంచి మార్కులే పడతాయి. ప్రమాణస్వీకారం రోజున సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా ఇరుగుపొరుగుతో సంబంధాల మెరుగుదలకు శ్రీకారం చుట్టిన మోదీ... ఏడాది కాలం పూర్తి కావస్తుండగా చైనా, మంగోలియా, దక్షిణ కొరియా చుట్టివచ్చారు. ఈ పన్నెండు నెలలకాలంలో ఆయన 18 దేశాలు పర్యటించారు. ఇందుకోసం మొత్తం 53 రోజుల సమయాన్ని వెచ్చించారు. ఈ పర్యటనల్లో లాంఛనప్రాయమైనవీ, వ్యూహాత్మకమైనవీ, వ్యాపార సంబంధమైనవీ, కేవలం ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించినవీ ఉన్నాయి. ఈ పర్యటనలవల్ల...మరీ ముఖ్యంగా చైనా పర్యటనవల్ల దేశానికి పెద్దగా ఒరిగిందేమిటని ప్రశ్నించేవారూ ఉన్నారు. వారి విమర్శల్లో కొంత నిజం లేకపోలేదు. ఇరుదేశాలమధ్య ఉన్న సరిహద్దు సమస్య తేలేలోగా ముందు వాస్తవాధీన రేఖపై స్పష్టత సాధిద్దామన్న మోదీ ప్రతిపాదనపై చైనా సానుకూలంగా స్పందించలేదు. అందుకు భిన్నంగా సరిహద్దు వివాదం విషయంలో ప్రస్తుతం ఉన్న శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి అవసరమైన పరస్పర విశ్వాస చర్యలు మరిన్ని అవసరమని ఉమ్మడి ప్రకటన పేర్కొంది. అదేవిధంగా భద్రతామండలిలో మనం కోరుతున్న శాశ్వత సభ్యత్వం విషయంలోనూ చైనా మౌనంగా ఉండిపోయింది. మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన చైనా... ఆసియాలో తనకు పోటీగా ఎదుగుతున్న భారత్వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం విషయంలో అంతత్వరగా మద్దతునివ్వగలదనుకోవడం కూడా సరికాదు. అయితే, రాజకీయాల్లాగే దౌత్యం కూడా సాధ్యాసాధ్యాలను ప్రయత్నించి చూసే కళ. నిరంతరాయంగా జరిగే చర్చలు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి మార్పునకు దోహదపడతాయి. గత ప్రధానుల ప్రయత్నానికి మోదీ పర్యటన కొనసాగింపుగా ఉన్నదా, లేదా అనేదే ప్రధానం. ఆ రకంగా చూస్తే మోదీ పర్యటన నిస్సందేహంగా ముందడుగే. భారత-చైనాలమధ్య సంబంధాల మెరుగుదలకు జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా పనిచేసినప్పుడు వాజపేయి అంకురార్పణ చేశారు. అప్పటితో పోలిస్తే ఈ సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. సరిహద్దు సమస్య అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే దౌత్య స్థాయిలో సమస్యల విషయంలో ఎలాంటి చర్చలు సాగుతున్నా బహిరంగంగా వాటిని గురించి ప్రస్తావించకపోవడం, ఇతరేతర వివాదాస్పద అంశాల జోలికి పోకుండా దౌత్యమర్యాదలను పాటించడం ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. మోదీ దానికి బ్రేక్ వేశారనే చెప్పాలి. ఆయన చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందే ఆ దేశం నిర్మించ తలపెట్టిన ‘న్యూ సిల్క్ రూట్’ ప్రాజెక్టుపై మన దేశం గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో రహదార్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది. అరుణాచల్ప్రదేశ్ వాసులకు చైనా స్టేపుల్డ్ వీసాలు మంజూరు చేయడాన్ని మోదీ ఈ పర్యటనలో అన్యాపదేశం గానైనా ప్రస్తావించి... ఇందుకు సంబంధించిన వైఖరిని మార్చుకోవాలని చైనాకు సూచించారు. అదే సమయంలో తాము చైనీయులకు ఈ-వీసా సౌకర్యం కల్పించబోతున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాద మూలాలు మన పొరుగునే ఉన్నాయని, అందువల్ల ఇరుదేశాలూ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. పాకిస్థాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిపై ఇది ఒకరకంగా విమర్శవంటిది. ఇలా చేస్తూనే గత ప్రధానులకంటే సంబంధాల మెరుగుదలలో మోదీ మరో అడుగు ముందుకేశారు. చైనాతో సంబంధాలు మలి దశకు వెళ్లడానికి సరిహద్దు సమస్య పరిష్కారం ముందస్తు షరతుగా ఉన్న గత విధానాన్ని ఆయన సవరించారు. చైనా పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఇందువల్ల ఇరుదేశాల కార్పొరేట్ సంస్థల మధ్యా 2,200 కోట్ల డాలర్లమేర వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. తొలిసారిగా పర్యాటక రంగంలోనూ సంబంధాల విస్తరణకు మార్గం సుగమమైంది. చైనాతో ఇలా దగ్గరవుతూనే ఆ దేశానికి పొరుగునున్న మంగోలియా, దక్షిణ కొరియాలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మోదీ ప్రయత్నిం చారు. మనతో సఖ్యతగా ఉంటూనే పాకిస్థాన్ను దువ్వడం, మన ప్రాంతంలోని దేశాలతో సన్నిహితమవుతూ ఆసియాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని కోరుకోవడం వంటి చైనా ఆకాంక్షలకు దాని భాషలోనే బదులిచ్చారు. కారణం ఏమైతేనేం దక్షిణ కొరియాతో సంబంధాలకు మన దేశం ఇంతకాలం పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అలాంటి దేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మోదీ తలుపులు తెరిచారు. పర్యవసానంగా ఆ దేశం భారత్లో 1,000 కోట్ల డాలర్లమేర పెట్టుబడులకు ముందుకొచ్చింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, రైల్వేలు, విద్యుదుత్పాదన వంటి మౌలిక రంగాల్లో ఈ పెట్టుబడులుంటాయి. ఇక మంగోలియా విషయానికొస్తే లోగడ ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఆ దేశం వెళ్లారుగానీ... మన దేశంనుంచి అక్కడ పర్యటించిన తొలి ప్రధాని మోదీయే. యురేనియం, బొగ్గు, రాగి, బంగారం నిల్వలు అపారంగా ఉన్న దేశం గనుక మంగోలియాతో సంబంధాలు మనకెంతో ఉపయోగపడతాయి. అలాగే భారత్ పెట్టుబడులకు ఆ దేశంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. అటు మంగోలియా కూడా తన పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, రష్యాలమధ్య ఒత్తిడికి లోనవుతున్నది. మూడో దేశంతో సంబంధాలు నెలకొల్పుకునే దిశగా కదలాలని మంగోలియా ఎప్పటి నుంచో భావిస్తున్నది. ఆరురోజులపాటు నరేంద్ర మోదీ సాగించిన ఈ పర్యటనలతో మన లుక్ ఈస్ట్ (తూర్పువైపు చూపు) విధానం మరింత పదునుదేరిందనే చెప్పాలి. రాగల రోజుల్లో దీని ఫలితాలు మరింత ప్రస్ఫుటమవుతాయి. -
కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపు
కఠ్మాండు: సార్క్ దేశాలు సహకారాన్ని పెంపొందించుకుని సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు. పరస్పరం కలహించుకోవటం మానుకుని ఇంధన భద్రత, పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యలపై ఐక్యంగా పోరాడాలన్నారు. బుధవారం కఠ్మాండులో సార్క్ దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు. దక్షిణాసియాను వివాద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పరిశీలక దేశాలది కూడా సార్క్లో కీలక పాత్రేనన్నారు. వాటితో చర్చించటం ద్వారా సార్క్ దేశాలు ప్రయోజనం పొందాలని ఆకాంక్షించారు. నమ్మకం ఆధారంగా మైత్రి కొనసాగాలని సూచించారు. ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని సార్క్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత తదితర అంశాలపై కలసికట్టుగా పోరాడాలన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వలసలను అరికట్టాలన్నారు. సార్క్ దేశాల్లో 25 శాతం జనాభా ఇంకా పేదరికంలోనే మగ్గుతోందని శ్రీ లంక అధ్యక్షుడు మహింద రాజపక్స చెప్పారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. తమ భూభాగం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ పొరుగువారికి హాని తలపెట్టటాన్ని అనుమతించబోమని అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో 1/5 శాతం ఉన్న సార్క్ దేశాలు పేదరిక నిర్మూలనకు ఆహార బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై దక్షిణాసియా దేశాలు అత్యవసరంగా స్పందించాల్సి ఉందని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పేర్కొన్నారు.