breaking news
Saakshar Bharat Programme
-
సాక్షర భారత్ కు నిధుల గండం
= నిలిచిన రూ. 6.61 కోట్ల నిధులు = మండల, గ్రామ కో ఆర్డినేటర్లకు అందని జీతాలు = 15 నెలలుగా పస్తులుంటున్నామని ఆవేదన యర్రగొండపాలెం, న్యూస్లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం నీరుగారే దశలో ఉంది. మండల, గ్రామ కోఆర్డినేటర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా గ్రామాల్లో సాక్షర భారత్ కార్యక్రమాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం, మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ఇది ఇంతో ఉపయోగకరం. ఉదయంపూట అందరి చేత పత్రికలు, కథల పుస్తకాలు చదివి వినిపించి, పనులకు వెళ్లి తిరిగి వచ్చాక రాత్రి వేళల్లో అక్షరాలు నేర్పించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వారికిచ్చే స్వల్ప వేతనం కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు. జిల్లాలోని 1041 పంచాయతీల్లో 2082 సాక్షర భారత్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్కో గ్రామ కోఆర్డినేటర్ ఉంటారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున జిల్లాలో 56 మంది మండల కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్కు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్కు నెలకు రూ. 2 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. మండల కోఆర్డినేటర్లకు 11 నెలలుగా రూ. 36.92 లక్షలు, గ్రామ కోఆర్డినేటర్లకు 15 నెలలుగా రూ. 6,24,60,000 ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి గౌరవ వేతనాలను నెలల తరబడి నిలుపుదల చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన వేతనాలను తక్షణమే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోఆర్డినేటర్లు కోరుతున్నారు. రూ. 30 వేలు రావాలి చేదూరి కాంతమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం 15 నెలల నుంచి మాకు గౌరవ వేతనం అందడం లేదు. నాకు రూ. 30 వేలు రావలసి ఉంది. వెంటనే ఇప్పించి ఆదుకోండి. ఇబ్బందులు పడుతున్నాం పరిమి త్రిపురమ్మ, గ్రామ కో ఆర్డినేటర్, వై పాలెం గౌరవ వేతనం నెలల తరబడి అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటిని నెట్టుకొచ్చేందుకు అప్పులు చేస్తున్నాం. అధికారులు మాపై దయచూపాలి. -
జీతాలు ఇంకెప్పుడిస్తరు!
శివాజీనగర్, న్యూస్లైన్ : నిరక్షరాస్యత నిర్మూలనకోసం అమలు చేస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం అభాసుపాలవుతోంది. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక కార్యక్రమ కోఆర్డినేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మండల, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు సుమారు 1,400 మంది పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే మండల కోఆర్డినేటర్లకు ఏడు నెలలుగా, గ్రామ కోఆర్డినేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోఆర్డినేటర్లు పలుసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లోని కోఆర్డినేటర్లంతా కలిసి ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని వయోజన విద్య డెరైక్టరేట్ను ముట్టడించాలని నిర్ణయించారు. పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, కనీస వేతనం పెంచాలని, వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను మండల కోఆర్డినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో భర్తీ చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఎనిమిది ప్రధాన డిమాండ్లతో డెరైక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు. వేతనాలు విడుదల చేయాలి సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏడెనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేయాలి. గ్రామ కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 4 వేలకు, మండల కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలి. నెలనెలా క్రమం తప్పకుండా వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి. -శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,సాక్షర భారత్ ఉద్యోగుల సంఘం, ఇందూరు